Harishrao Arrest: సైబరాబాద్ ఆఫీస్ వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. కొండాపూర్ లోని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు తాను సీపీ ఆఫీస్ నుంచి కదిలేది లేదంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి అక్కడే బైఠాయించారు. సీపీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో పోలీసులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో హరీశ్ రావుతోపాటు మిగతా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి దగ్గరలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
Also Read: మాపైనే కౌశిక్ దాడి చేసి.. పూల కుండీలు విసిరేశారు: అరికెపూడి గాంధీ
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ 19 మందిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
అయితే, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీపీ ఆఫీస్ వద్ద బైఠాయించారు. అప్పటివరకు అక్కడి నుంచి కదిలేదంటూ వ్యాఖ్యానించారు. ఇటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సీపీ ఆఫీస్ వద్ద నినాదాలు చేస్తుండడంతో వారికి పోలీసులు నచ్చజెప్పేలా ప్రయత్నించినా వారు ఎంతకు వినకపోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీపీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. కాగా, అరెస్టైన వారిలో ఎమ్మెల్యే హరీశ్ రావుతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
Also Read: ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం.. రాత్రి 12 అయినా కదలం: హరీశ్రావు
అయితే, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై పలు వ్యాఖ్యలు చేయడంతో ఆయన తన అనుచరులతో కలిసి గురువారం ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు, అరికెపూడి అనుచరులు పెనుగులాడుకున్నారు. ఈ పరిణామంలో కౌశిక్ ఇంట్లోని పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇటు అరికెపూడిని పంపించేశారు.
ఆ తరువాత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి నేరుగా సీపీ ఆఫీస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పోలీసులు స్వీకరించినా కూడా వారు అక్కడే ఉండి ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు.