తెలంగాణలో రుణమాఫీ.. పొలిటికల్ రణమాఫీగా మారింది. మాజీ మంత్రి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు సవాళ్లను తెరపైకి తెస్తూ.. ఆయన రాజీనామా చేసేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. పంద్రాగస్టు నాటికి రుణమాఫీ జరిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్రావు సవాల్ను గుర్తు చేస్తూ..హైదరాబాద్లో ఫ్లెక్సీలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
వాస్తవానికి రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటూ ముందుకుకెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్ట్ 15 లోపు విడతల వారీగా రుణమాఫీ చేసి.. చూపించారు. ఇప్పటికే రెండు విడతల్లో రైతులను రుణవిముక్తులను చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా మూడో విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేశారు. .. రైతులకు రుణమాఫీ చెక్కులను అందించారు. మూడో విడత రుణమాఫీతో 14.4 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
మొత్తంగా 32.50 లక్షల మంది రైతులకు రుణవిముక్తులను చేసేందుకు 31 వేల కోట్ల నిధులను కేటాయించడం.. దేశరాజకీయాల్లోనూ ఆల్టైమ్ రికార్డ్ అంటున్నారు. జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం మొదలుపెట్టింది. జులై 18న మొదటి విడతగా.. లక్ష రూపాయల స్లాబ్ వరకూ రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది. రెండో విడతలో లక్ష నుంచి 1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది.
మూడో విడతతో కీలకమైన రుణమాఫీ ప్రక్రియ ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. చెప్పినట్లే రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెబుతున్నారు. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా.. చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీని నెరవేర్చారు. దీంతో దటీజ్.. రేవంత్ రెడ్డి.. అన్న డైలాగ్ తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది.
Also Read: ఏపీకి బీఆర్ఎస్ లీడర్లు.. కేసీఆర్ ప్లాన్ ఇదేనా..
అదలా ఉంటే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ జరిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు చేసిన సవాల్ మళ్లీ ఫోకస్ అవుతోంది. ఇప్పుడు ఇచ్చిన టైమ్ ప్రకారం రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు. ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీశ్ రావు.. ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని లేకపోతే అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దానికి ఫక్తు పొలిటీషియన్లానే రియాక్ట్ అయ్యారు హరీష్రావు.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన సవాల్పై యూటర్న్ తీసుకున్నారు. అసలు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని రైతులను మోసం చేసినట్లు క్లియర్గా కనబడుతున్నప్పుడు రాజీనామా ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి..? అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఎటాక్కి దిగుతున్నారు. ఏదేమైనా హరీష్రావు ఇప్పుడు పబ్లిక్గానే ట్రోల్ అవుతున్నారు. రుణమాఫీ అయిపోయే.. నీ రజీనామా ఏడబోయే అంటూ హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అభిమానులు హరీష్రావు ఫోటోవేసి ట్రోలింగ్ మొదలుపెట్టారు.