Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులకు భారీ శుభవార్త చెప్పింది. రుణమాఫీకి సంబంధించిన మూడో విడత నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంపై ప్రసంగించారు. రుణమాఫీ చేసినందుకు తమకు సంతోషంగా ఉందన్నారు. దీనిపై సవాల్ విసిరిన హరీశ్ రావుకు ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
అయితే, వారి సవాల్ పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదన్నారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారన్నారు. అనవసరంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సీఎంను తానెప్పుడూ చూడలేదన్నారు.
Also Read: బ్రేకింగ్ న్యూస్.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపు
‘సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ. 40 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అది నెరవేర్చలేక పార్లమెంటు ఎన్నికలకు ముందు మరో నాటకానికి ఆయన తెరలేపారు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్లపై ఒట్టు పెట్టినా అబద్ధమే ఆయన లక్షణం. మేం తొలి దఫాలో రూ. లక్ష రుణమాఫీ చేస్తేనే 35 లక్షల మంది రైతులకు రూ. 17 వేల కోట్లు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ. 17 వేల కోట్లు మాత్రమే అవుతాయా? ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ అబద్ధమని తెలిపోయింది. మీరు మోసం చేశారన్నది స్పష్టంగా తేలిపోయినంక రాజీనామా ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పారో ఆ దేవుళ్లందరి వద్దకు స్వయంగా నేనే వెళ్తాను. ఆయన చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని కోరుతా’ అంటూ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.