ఇది.. కోతల ప్రభుత్వం
– రైతులకు యమపాశంగా కాంగ్రెస్ పాలన
– మేడ్చల్ రైతు ఆత్మహత్యే అందుకు నిదర్శనం
– ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ అని చెప్పి చేయలేదు
– ఇప్పటికైనా అందరికీ రుణమాఫీ చేయాలి
– యాసంగి టైమ్ వస్తున్నా వానాకాలం రైతు బంధు ఇవ్వరా?
– రైతుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందన్న హరీష్ రావు
Harish Rao: రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాటల దాడి కొనసాగుతోంది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు. ఇది కోతల ప్రభుత్వం అంటూ ఫైరయ్యారు. రైతు రుణమాఫీకి అనేక కోతలు పెడుతున్నారని, కొందరికి పెండ్లి కాలేదని రుణమాఫీ చెయ్యకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మాటలకు పొంతన లేదని, రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ ఆంక్షల పేరుతో రేవంత్ రెడ్డి పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడు అయ్యిందన్నారు. ఇప్పటిదాకా 470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని, వారి లిస్టును పంపితే సీఎం ఇప్పటివరకు కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.
‘‘9 నెలల కాంగ్రెస్ పాలన రైతులకు యమపాశంగా మారింది. సురేందర్ రెడ్డి అనే రైతు మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు లేఖ రాసి చేసుకున్న ఆత్మహత్యనే దీనికి రుజువు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య లేఖలోని ప్రతి అక్షరం రేవంత్ రెడ్డి నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. అతన్ని చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి పరామర్శ లేదు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెప్పి, అమలు చేయలేకపోయినందుకు రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి, ఇప్పటికైనా రైతు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలి. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది. ఎంతవరకైనా, ఎవరితోనైనా కొట్లాడుతాం’’ అని స్పష్టం చేశారు హరీష్ రావు.
Also Read: Chamala: పదేళ్లు మంత్రిగా పనిచేసిన మీకు ‘ఇది కూడా తెల్వదా కేటీఆర్’..? : చామల
రేవంత్ రెడ్డికి అసలు పెట్టుబడి సాయం అర్థం తెలుసా అని ప్రశ్నించిన ఆయన, కేసీఆర్ 11 విడతలుగా రైతు బంధు ఇచ్చారని, యాసంగి పంట వేసే టైం వస్తున్నా వానాకాలం రైతు బంధును కాంగ్రెస్ సర్కార్ ఇవ్వలేదని ఫైరయ్యారు. ఇక, పోలీసులను తాను ఎక్కడా తప్పు పట్టలేదన్నారు హరీష్. తమ హయాంలో ప్రతీ పోలీస్ స్టేషన్కు రూ.75 వేలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ డబ్బులను ఆపేసిందని, దీనిపైన పోలీస్ సంఘాలు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. పోలీసులకు ఇన్నోవా వాహనాలు ఇచ్చి గౌరవాన్ని కాపాడామని గుర్తు చేశారు.