Tihar Jail: ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్ర కలిశారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీశ్ రావు, వద్దిరాజు రవిచంద్రలు తిహార్ జైలుకు వెళ్లి కవితను కలిశారు.
తిహార్ జైలులో ఆమె గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరంతో బాధపడ్డారు. జైలు అధికారులు వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ఆమె వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో అధికారులు తిరిగి ఆమెను తిహార్ జైలుకు తరలించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత.. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు సహా సుప్రీంకోర్టు వరకు ఆమె బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్ పిటిషన్లను పలుమార్లు తిరస్కరించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన తదుపరి విచారణ జరగనుంది.
Also Read: Breaking News: పిన్నెల్లికి షరతులతో కూడిన బెయిల్
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీలోకి తీసుకుంది. ఈడీ తర్వాత సీబీఐ కూడా కోర్టు అనుమతి తీసుకుని ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ కేసులో ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగిస్తూనే వస్తున్నది. గతంలోనూ కవిత అనారోగ్యం బారిన పడ్డారు. జులై 16న ఆమె అస్వస్థతకు గురైంది. అప్పుడు అధికారులు ఆమెను దీన్ దయాళ్ హాస్పిటల్ తరలించారు. అక్కడ చికిత్స అందించగా కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె అస్వస్థతకు గురయ్యారు.