– పెసర అమ్మకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
– తీవ్రంగా నష్టపోతున్న రైతన్న
– కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రశ్నించిన హరీష్ రావు
– సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
– బోనస్ బోగస్ అయ్యిందని విమర్శలు
Harish Rao: ఆహార పంటలకు బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ.8,682 ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు విక్రయిన్నారని, ప్రైవేట్ వ్యాపారులు ఆడిందే ఆటగా మారటంతో రైతులు క్వింటాకు రూ.2,500 పైగా నష్టపోతున్నారని వివరించారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం
మద్దతు ధరకు వ్యాపారులు పంటలు కొనుగోలు చేయని పరిస్థితుల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు హరీష్ రావు. దానివల్ల మార్కెట్లో పోటీ ఏర్పడి వ్యాపారులు సైతం ఎక్కువగా చెల్లించి పంటలు కొనుగోలు చేసేవారన్నారు. కానీ ఈ సంవత్సరం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం ప్రదర్శించడం పెసర పంట రైతులకు శాపంగా మారిందన్నారు. కష్టపడి పండించిన పంటను మద్దతు ధరకు విక్రయించే పరిస్థితి లేదని ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణ పేట, సూర్యాపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పంట మొత్తం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులకు ఉపయోగంగా ఉంటుంది తప్ప రైతన్నలకు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Also Read: Rubbing Tiger’s Belly: పులికి బెల్లీ మసాజ్ చేయడం ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు
రైతన్నను మరోసారి మోసం చేశారు
ఇప్పటికే రుణమాఫీ, రైతు బంధును అటకెక్కించిన ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామన్న మాటను బోగస్ చేసిందన్నారు హరీష్ రావు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మంగళం పాడారని, అదే తీరుగా ఇప్పుడు మద్దతు ధర ప్రకారం పంటలు కొనుగోలు చేసే బాధ్యతను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రైతుల నెత్తిన మరోసారి టోపీ పెడుతున్నారన్న ఆయన, కాంగ్రెస్ పాలనలో పంటలు పండించడం, పండించిన పంటలను విక్రయించుకోవడం రైతన్నకు కత్తిమీద సాముగా మారిందని విమర్శించారు.
రైతు వ్యతిరేక విధానాలు వీడాలి
ఎన్నికలకు ముందు ఒక తీరుగా, అధికారంలోకి వచ్చాక మరొక తీరుగా వ్యవహరించడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు హరీష్ రావు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని సూచించారు. మార్క్ ఫెడ్ ద్వారా పెసర కొనుగోలు కేంద్రాలు జిల్లాల్లో తక్షణం ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు హరీష్ రావు.