Hyderabad: ఇది ఖతర్నాక్ క్రైమ్ న్యూస్. అనగనగా ఓ స్క్రాప్ షాప్. పాత ఇనుప సామాన్లను హోల్సేల్గా అమ్మేస్తుంటారు. పెద్ద బిజినెస్సే. భారీగానే సంపాదిస్తున్నారు. అయితే, పన్నులు మాత్రం కట్టట్లేదు. వారు జీఎస్టీ ఎగ్గొడుతున్న విషయం సంబంధిత అధికారులు పసిగట్టారు. ఇద్దరు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు మణిశర్మ, ఆనంద్.. హైదరాబాద్ సరూర్నగర్లోని ఆ స్క్రాప్ షాపుపై రైడ్ చేశారు.
కట్ చేస్తే.. తన స్క్రాప్ షాపుపైనే రైడ్ చేస్తారా? అంటూ ఆ ఇద్దరు జీఎస్టీ అధికారులపై దాడి చేశారు షాపు యజమాని అతని మనుషులు. అంతటితో వదిలిపెట్టలేదు. వారి ఐడీ కార్డులు లాక్కున్నారు. మణిశర్మ, ఆనంద్లను కిడ్నాప్ చేసి.. ఫార్చ్యునర్ కారులో అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వదిలేయాలంటే 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరేనని.. తమ పైఅధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు ఆ ఇద్దరు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు జీఎస్టీ ఉన్నతాధికారులు. అలర్ట్ అయిన పోలీసులు.. సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి.. వారి వాహనం ఎక్కడ ఉందో గుర్తించారు. స్పెషల్ టీమ్స్గా ఫామ్ అయి.. ఆ వెహికిల్ను ఛేజ్ చేసి పట్టుకున్నారు ఖాకీలు. ఇద్దరు జీఎస్టీ అధికారులను సురక్షితంగా రక్షించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
విషయం తెలిసి.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. హైదరాబాద్ సీపీకి ఫోన్ చేశారు. ఘటనపై పూర్తి వివరాలు అందించారు కమిషనర్. నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించారు సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్.
అయితే.. చివర్లో మరో ట్విస్ట్. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. వారు నిజమైన జీఎస్టీ అధికారులని తమకు తెలీదని.. ఫేక్ ఐడీలతో తమను భయపెట్టి దోచుకోవడానికి వచ్చారని భావించామని.. అందుకే వారిపై దాడి చేశామని చెప్పడం ఆసక్తికరం.