BRS: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయ్. ఎవరికి వారే ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుండటంతో.. పలు చోట్ల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయ్. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు.. మాజీల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. ఆత్మీయ సమావేశాల్లో గ్రూపు రాజకీయాలన్నీ బయటపడుతున్నాయ్.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆత్మీయ సమేళనం రసాభాసాగా మారింది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేడ్చల్ అభ్యర్థి తానేనని మల్లారెడ్డి ప్రకటించుకోవడంపై సుధీర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో మంత్రి మల్లారెడ్డి తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన తనను.. జడ్పీ చైర్మన్ అయిన తన కుమారుడిని పిలవకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
తన హయాంలోనూ మేడ్చల్ నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని.. మంత్రి మల్లారెడ్డి ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ కార్యకర్తలందరినీ పిలవలేదని.. ఇలాంటి పునారవృతమైతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే సుధీర్రెడ్డి మాట్లాడుతుండగానే మంత్రి మల్లారెడ్డి మైకును లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. అక్కడే వేదికపై ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇరువురు నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
సిద్దిపేట జిల్లాలోనూ ఆత్మీయ సమ్మేళనాలు రసాభాసాగా మారాయ్. జగదేవ్పూర్ మండలంలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాయకులే కాకుండా కార్యకర్తలకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. ఒకరిద్దరు నాయకుల పెత్తనం వల్ల పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.