హైదరాబాద్ అశోక్నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. బృందావన్ హాస్టల్లో ఉంటూ గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రవళిక తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడిందనే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రవళిక మృతదేహాన్ని పోలీసులు తరలించే సమయంలో హాస్టల్ వద్దకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులను అడ్డుకున్నారు. ఈ సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు, అభ్యర్థుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.
విద్యార్థుల ఆందోళన మధ్యే ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ప్రవళిక తల్లిదండ్రులు విగతజీవిగా పడివున్న కూతురుని చూసి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల కన్నీటి రోదనలు అందర్నీ చలింపజేశాయి. కూతురు కోసం ఏడుస్తూ తల్లి విజయ స్పృహతప్పి పడిపోయింది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ఇక లేదనే వార్తతో తండ్రి లింగయ్య బరువెక్కిన గుండెతో లోలోన కుమిలిపోతూ పోస్టుమార్టం కోసం దుఖంతో సంతకం చేస్తుంటే అక్కడ ఉన్నవారందరూ కంటతడిపెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత పోస్టుమార్టం ప్రక్రియ పూర్తైంది. ఆ తర్వాత ప్రవళిక మృతదేహానిక్ని స్వగ్రామం వరంగల్ జిల్లా పోనకల్ బిక్కాజిపల్లికి తరలించారు.
మరోవైపు హైదరాబాద్లో గ్రూప్ -2 అభ్యర్ధి ఆత్మహత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రవల్లిక ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ ప్రజా సంఘాలు, విద్యార్ధులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు భద్రత పెంచారు. ఘటనా ప్రాంతంలోని హాస్టళ్ల నుంచి విద్యార్ధులు బయటకు రాకుండా పహారా కాస్తున్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్లోని హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ -2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు ఆమె స్నేహితులు. ఆత్మహత్యకు ముందు ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆమె తన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఈ లేఖ రాశారు.” అమ్మా..నన్ను క్షమించండి. నేను చాలా నష్టజాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడ్వకండి అమ్మా..జాగ్రత్తగా ఉండండి..మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు..నేను మీకు చాలా అన్యాయం చేస్తున్నా అమ్మా..నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మా. .నాన్న జాగ్రత్త అంటూ” ప్రవళిక రాసిన సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది.
గ్రూప్-2 వాయిదా పడిందనే మనస్థాపంతో తన అక్క ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు ప్రవళిక తమ్ముడ ప్రణయ్. ఆత్మహత్యకు కారణం.. లవ్ ఎఫైర్ అని పోలీసులు చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే రెండేళ్లు ఇంటి నుంచి అమ్మనాన్న కష్టపడి డబ్బులు పంపి చదివించారు. ఇప్పుడు మళ్లీ ఎగ్జామ్ వాయిదా పడింది. డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారని బాగా కుమిలిపోతూ ఫోన్ చేసిందని చెప్పాడు. అక్క ఫోన్ చేసి ఒక్క రోజు కూడా గడవక ముందే ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని కన్నీరు పెట్టుకున్నాడు.