Sharmila : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తిరిగి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసులు గ్రీన్ స్నిగల్ ఇచ్చారు. ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు పాదయాత్రకు వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతి ఇచ్చారు. షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ఇచ్చారు. గతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో షర్మిల పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది.
గతేడాది నవంబర్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయింది. నర్సంపేట మండలం రాములునాయక్ తండా సమీపంలో 223వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభించి రాజపల్లి, మగ్దుంపురం మీదుగా చెన్నారావుపేటకు చేరుకోగానే బీఆర్ఎస్ కార్యకర్తలు అడుకున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు దాడులు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఎమ్మెల్యే పనితీరును తప్పుపడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చిపోయాయి. షర్మిల బసచేసే కారవాన్పై దాడి చేశారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల తర్వాత శాంతిభద్రతల సమస్య పేరుతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు.
ధ్వంసంమైన కారుతో హైదరాబాద్ లో షర్మిల నిరసన చేపట్టారు. ఆ కారులోనే ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. ఆమె కారు నుంచి దిగాలని కోరినా దిగలేదు. దీంతో ఆమెను కారుతో సహా లిఫ్ట్ చేసి ట్రాఫిక్ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. స్వయంగా ప్రధాని మోదీ.. షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించడంతో రాజకీయం మరింత హీటెక్కింది.
ఆ తర్వాత పాదయాత్ర నిలిచిపోయిన చోట నుంచే మళ్లీ ప్రారంభించేందుకు షర్మిల ప్రయత్నించినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నారు షర్మిల. అయినా సరే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వాలని మరోసారి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షర్మిల పాదయాత్రకు పోలీసులు ఇప్పుడు అనుమతి ఇచ్చారు.
రోజూ ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే షర్మిల పాదయాత్ర చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పార్టీలు, కులాలు, మతాలు, ఎవరిపైనా వ్యక్తిగతంగా వివాదాస్పదవాఖ్యలు చేయవద్దని సూచించారు. ర్యాలీల్లో బాణసంచా కాల్చవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదని పోలీసులు నిబంధనల్లో పేర్కొన్నారు.
లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది. పాదయాత్రలో షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అదే విషయాన్ని నిబంధనల్లో పేర్కొన్నారు. మరి షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ముందుకు సాగుతారా? ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు అడ్డుకోకుండా ఉంటారా? చూద్దాం ఏం జరుగుతుందో..