Governor : తెలంగాణలో రాజభవన్, ప్రగతి భవన్ మధ్య నిత్యం ఏదో ఒక విషయంలో వివాదం రేగుతోంది. ప్రొటోకాల్ వివాదంతో గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తొలుత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అనేక ఇష్యూల్లో తమిళిసై , మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ కు ఆహ్వానం పంపకపోవటం తెలంగాణలో కామన్ గా మారింది. రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ ఇదే జరిగింది. తాజాగా బోనాల పండుగ వేళ మరో వివాదం మొదలైంది.
ఎప్పటిలాగే తెలంగాణ ప్రభుత్వం తరుఫున బోనాలకు తనకు పిలుపు రాలేదని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. అందుకే రాజ్భవన్లో బోనాల వేడుకలు నిర్వహిస్తున్నానని తెలిపారు. పాతబస్తీలో లాల్ దర్వాజా బోనాల జరుగుతున్న వేళ రాజ్భవన్లోని నల్లపోచమ్మ అమ్మవారికి గవర్నర్ తమిళిసై బోనం సమర్పించారు. వడి బియ్యం పోశారు.
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై బోనాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు జరుపుకొంటున్నారని వివరించారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలని అమ్మవారిని కోరుకున్నానని తమిళిసై చెప్పారు.