Tamilisai : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ దగ్గరుండి గవర్నర్ తమిళిసైకు స్వాగతం పలికారు. శాసనసభ హాల్లో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. కాళోజీ కవితతో తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. తలసరి ఆదాయం రూ. 3,17,115కు పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు,ఐటీ ద్వారా రాష్ట్రానికి 3.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతోందని తెలిపారు.
సంక్షేమ పథం..
సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని గవర్నర్ తెలిపారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని వివరించారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించామని తమిళిసై తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. హరితహారం ద్వారా 7.7 శాతం పచ్చదనం పెంచామన్నారు. బతుకమ్మ పండుగ చీరల ద్వారా చేనేతలకు ఉపాధి కల్పించామని చెప్పారు. నేతన్నల కోసం రూ. 5 లక్షల బీమా పథకం తీసుకొచ్చామన్నారు. న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లతో, జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామన్నారు. 12.5 లక్షల మందికి షాదీ ముబారక్ పథకం కింద నగదు సాయం చేశామన్నారు. అలాగే 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి కింద సాయం చేశామన్నారు. దళితబంధు ద్వారాప్రతి దళితుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నామన్నారు. ఆసరా పథకం లబ్ధిదారుల వయస్సు 57ఏళ్లకు తగ్గించామని చెప్పారు. ఎస్టీల రిజర్వేషన్ను 10 శాతానికి పెంచామన్నారు. 11వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ చేశామని వివరించారు. మాంసం ఉత్పిత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉందన్నారు.
మెరుగైన వైద్య సౌకర్యాలు..
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వరంగల్లో రూ. 1100 కోట్లతో 2 వేల బెడ్స్ సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 20 జిల్లాల్లో డయాగ్నెస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 342 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని చెప్పారు.ఆశావర్కర్లకు రూ. 9,750 పారితోషికం ఇస్తున్నామన్నారు.
విద్యలో వెలుగులు..
రాష్ట్రంలో 203 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని గవర్నర్ తెలిపారు. రూ. 7,289 కోట్లతో మన ఊరు-మన బడి కింద స్కూళ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. 3 దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
ఉద్యోగాల జాతర..
గత ఎనిమిదేళ్లలో 2,21, 774 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. స్థానిక అభ్యర్థులకే 95 శాతం ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఒకేసారి 80,039 ఉద్యోగాల భర్తీ చేశామని స్పష్టం చేశారు. 2022 ఫిబ్రవరి వరకు1,41,735 ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని గవర్నర్ తెలిపారు. మొత్తంమీద ఎలాంటి వివాదాలు చోటు చేసుకుండా గవర్నర్ ప్రసంగం ప్రశాంతంగా సాగింది. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టాలని బీఏసీ భేటీలో నిర్ణయించారు. ఈ నెల 6న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ నెల 8న బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. సమావేశాల కొనసాగింపుపై ఈ నెల 8న మళ్లీ బీఏసీ భేటీ జరగనుంది.