Warangal: వరదలతో వరంగల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన.. బాధితులను పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నా.. ముందస్తుగా చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. ఆక్రమణలతోనే ఎక్కువగా ముంపునకు గురవతున్నారని.. ముంపు ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు.
ప్రతి ఏటా ఇలా ముంపునకు గురవుతుంటే.. శాశ్వత పరిష్కారం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు గవర్నర్. వర్షాల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే భయానక పరిస్థితులు ఎదురవుతాయన్నారు. వర్షాలు పోయాయని ఊరుకోవద్దని.. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు. కేంద్రం బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని చెప్పారు తమిళిసై.
వరంగల్ పర్యటనలో మొదట భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు గవర్నర్. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను పరిశీలించారు. హంటర్ రోడ్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో సందర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నిత్యావసరాలను, హెల్త్ కిట్స్ను వరద బాధితులకు పంపిణీ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూస్తానని గవర్నర్ తమిళిసై హామీ ఇచ్చారు.