Tamilisai: ప్రీతి.. ర్యాగింగ్ భూతానికి బలైన వైద్య విద్యార్థిని. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సైఫ్ను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని కాళోజీ యూనవిర్సిటీకి లేఖ రాశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ర్యాగింగ్ వంటి ఘటనలు జరిగినప్పుడు తీసుకునే చర్యలపై ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని లేఖలో కోరారు.
అలాగే వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.