గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకార అంశం ఉత్కంఠగా మారింది. సోమవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లిన ఇద్దరు నేతలకూ నిరాశ ఎదురైంది. రెండు గంటలపాటు కౌన్సిల్ హాల్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోసం వేచి చూశారు. అయితే.. దీనిపై స్పందించిన కోదండరాం.. తాము మండలి ఛైర్మన్కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లామని చెప్పారు. ఈనెల 31న ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలని సందేశం పంపినట్లు సమాచారం.
తాను అందుబాటులో లేననే అంశంపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ మాత్రమే ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాల్సిందిగా తనను అడిగారని.. 31న మధ్యాహ్నం మూడున్నర గంటలకు వస్తానని చెబితే తాను అంగీకరించానని తెలిపారు. మిగతా ఎమ్మెల్సీతోనూ అదేరోజు ప్రమాణం చేయించేలా ఏర్పాట్లు చేయాలని తాను అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోదండరాం, అమీర్ అలీఖాన్ సమాచారం ఇవ్వకుండానే ప్రమాణం కోసమంటూ తన కార్యాలయానికి వచ్చారని సుఖేందర్రెడ్డి వెల్లడించారు. మండలి ఛైర్మన్గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.