Governor Bandaru Dattatreya car accident: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన కాన్వాయ్కు ఓ వ్యక్తి అడ్డం వచ్చాడు. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ అప్రమత్తమై సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒక్కదానికొకటి వరుసగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిందనే విషయం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.