Telangana : బతుకమ్మ చీరలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి వరుస కౌంటర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దీనిపై మాట్లాడుతూ, మహిళల గురించి హరీష్ రావు తెగ మాట్లాడుతున్నారని, గత పదేళ్లలో వారిని అన్ని రకాలుగా అణిచివేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కనీసం మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వకుండా నియంతృత్వ పోకడలు పోయింది ఎవరంటూ ఫైరయ్యారు.
స్వయం సహాయక గ్రూపులను నిర్వీర్యం చేశారని, పావలా వడ్డీ రుణాలు ఎత్తివేసి మహిళలకు అన్యాయం చేసింది కేసీఆర్ కాదా అని అడిగారు. ‘‘మహిళల కోసం ఒక్క కార్యక్రమమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా. బతుకమ్మ చీరలు ఇచ్చామని హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చిన బతుకమ్మ చీరలు ఎలా ఉన్నాయో తెలంగాణ అక్క చెల్లెమ్మలకు తెలుసు. మీరు ఇచ్చిన చీరలు పాత సామాన్లకు, పంట చేలకు అడ్డం కట్టడానికి తప్ప కట్టుకోవడానికి ఉపయోగపడలేదు.
ALSO READ : గ్రూప్ 1 మెయిన్స్కు పకడ్బందీగా ఏర్పాట్లు
మహిళల గురించి మాట్లాడటానికి హరీష్ రావుకి సిగ్గుండాలి. మా ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులను ఎలా గౌరవిస్తుందో నీ కళ్లకు కనిపించడం లేదా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఇళ్లకు రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇందిరా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే ఇస్తున్నాం.
మహిళలనే యజమానిగా పేర్కొంటూ ఫ్యామిలీ డిజిటల్ కార్డులిస్తున్నాం. ఒక ఆదివాసీ, ఒక బీసీ మహిళకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించాం’’ అని చెప్పుకొచ్చారు. మహిళాభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదన్న ఆది శ్రీనివాస్, నోరు తెరిస్తే మహిళలను అవమానించేలా మాట్లాడే కేటీఆర్ను పక్కన పెట్టుకొని హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతోందా అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విమర్శించడం ఆపకపోతే తెలంగాణ అక్క చెల్లెమ్మల చేతిలో మరోసారి చిత్తు కావడం ఖాయమని హెచ్చరించారు.