Medigadda Barrage : కేసీఆర్ నాయకత్వంలోని గులాబీపార్టీ తన పాలనతో సాధించిన అతిపెద్ద విజయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పదేపదే చెప్పుకుంటూ వస్తోంది. ఈ ప్రాజెక్టు ఏ మేరకు లాభదాయకం అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే.. తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రమాణాలపై చర్చ మొదలైంది. ఈ వార్త వచ్చిన వెంటనే దీనిని విద్రోహచర్యగా ప్రచారం చేసినా.. పునాదుల వద్ద ఇసుక కదిలిపోవటం వల్ల కుంగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పదికాలాల పాటు దృఢంగా నిలిచి సేవలందించాల్సిన ఈ కొత్త ప్రాజెక్టు ఆదిలోనే కుంగిపోవటంతో ప్రస్తుత శాసనసభ ఎన్నికల వేళ.. విపక్షాలకు ఇదో పెద్ద అస్త్రంగా మారుతోంది.
లక్ష్మీ బరాజ్గా వ్యవహరించే దీని నిర్మాణం 2016 మే లో ప్రారంభమై 2019 జూన్ నాటికి ముగిసింది. సుమారు రూ..1850 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ బ్యారేజీలో 16 టీఎంసీల నీరు నిల్వ చేయొచ్చు. దీనికి 85 గేట్లు అమర్చారు.
కేవలం బ్యారేజీ మాత్రమే గాక.. మహారాష్ట్ర, తెలంగాణలను కలిపే వంతెనగానూ ఉపయోగపడుతోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒకేసారి సుమారు 16 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోసి రికార్డు సృష్టించగా, 2018 డిసెంబరులో మేడిగడ్డలో ఆ రికార్డును బద్దలుకొడుతూ 25 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోశారు. రికార్డు సమయంలో (2 ఏళ్లలోనే) పూర్తయిన ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రచారం చేసుకున్న ఈ బ్యారేజీలోని మోటర్లు.. భారీ వర్షాలకు మునగటం కూడా గతంలో వార్తల్లోకి ఎక్కినా.. ప్రభుత్వం మాత్రం ‘క్లౌడ్బరస్ట్’ అని తప్పించుకుంది.
అయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ప్రభుత్వం ఈ ఎన్నికల వేళ.. వివాదాల్లో నిలవటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ తిన్నది. అయితే.. దీనిపై వీలున్నంత మౌనంగా ఉంటూ.. ప్రచారంలో దీని ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతోంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలను పరిశీలించేందుకు కేంద్ర కమిటీ ఈ ప్రాజెక్టును సందర్శించింది. ఈ సమయంలో కేంద్రకమిటీ 20 అంశాలపై వివరణ కోరగా, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు మాత్రం కేవలం 3 అంశాలకే వివరాలిచ్చినట్లు సమాచారం. దీంతో దీనిపై ఆదివారం లోగా తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్రం కోరుతూ ఒక లేఖ రాసింది. ఈ తర్వాతే.. సంపూర్ణ సమాచారంతో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వనుందని.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు విపక్ష కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాజెక్టు సందర్శనకే బయలుదేరగా ప్రభుత్వం అడ్డుకోవటం, మీడియానూ అక్కడికి అడుగు పెట్టనీయకపోవటం, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఏరియల్ సర్వే ద్వారానే దీనిని వీక్షించాల్సి రావటంతో ప్రభుత్వం ఏదో దాస్తోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
భారీ నిర్మాణాల్లో సమస్యలు తలెత్తడం కొత్తేమి కాకపోయినా, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. చిన్న చిన్న కారణాలకే విపక్షాల మీద గయ్యిమని లేచే అధికార పార్టీ చిన్న అవకాశం, ఆధారం దొరికినా విపక్షాలపై గయ్యినలేచే గులాబీ పార్టీ ముఖ్యులు వేలకోట్ల ప్రజాధనంతో నిర్మితమైన ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడిందనే వార్తలొస్తున్నా.. ఏమీ పట్టనట్టుగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావటంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా.. మరో వారానికి గానీ..దీనిపై మరింత స్పష్టత వచ్చేలా కనిపించటం లేదు.