యర్రవరంలో మనుషులు చేసిన దేవుళ్లపై బిగ్ టీవీ ప్రసారం చేసిన నాన్ స్టాప్ కథనాలకు ఫలితం దక్కింది. ఇక్కడ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు వ్యక్తులు చేస్తున్న దందాపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తేవాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలపాలని కోరింది. దీంతో ఇన్నాళ్లూ ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని తన కనుసన్నల్లో శాసించిన వారికి చెక్ పడింది.
సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని యర్రవరంలో కొన్నాళ్ల క్రితం లక్ష్మీనరసింహస్వామి విగ్రహం వెలుగు చూసింది. దీంతో అనతికాలంలోనే ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే దేవుడి మాటున జరుగుతున్న దందాను బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది.
యర్రవరంలో భక్తులు ఇచ్చే విరాళాలకు లెక్కాపత్రం ఉండాలని బిగ్ టీవీ డిమాండ్ చేసింది. అప్పుడు బిగ్ టీవీ ప్రశ్నలకు.. సామాన్య భక్తులు కూడా గొంతు కలిపారు. హుండీ ఆదాయానికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. దీంతో ఇష్యూ కాస్తా మరింత వేడెక్కింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం యర్రవరం ఆలయంలో జరగుతున్న వ్యవహారంపై స్పందించింది. ఈ గుడిని దేవాదాయశాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. దీంతో ఆలయంలో ప్రైవేట్ వ్యక్తుల దందాకు చెక్ పడనుంది.