Group 1 Exam : తెలంగాణలో 13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు జరగబోతున్నాయి. అయితే, కొందరు మాత్రం వాయిదా వేయాలని పట్టుబట్టారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, గ్రూప్ 1 పరీక్షపై బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని అన్నారు.
అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీసీ బిడ్డగా, తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం నుంచి ఇస్తున్న భరోసాగా తెలిపారు. జీవో 29తో నష్టం అనేది అపోహ మాత్రమేనని, బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చిందని, పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో పట్టుమని 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు.
ALSO READ : గ్రూప్ 1 మెయిన్స్కు సర్వం సిద్ధం
ఇంటర్ ఫలితాలు కూడా చక్కగా ఇవ్వలేని మీరు మా గురించి మాట్లాడుతారా అంటూ ఫైరయ్యారు. ఇక బండి సంజయ్ తీరుపై మండిపడ్డ మహేష్ గౌడ్, కేంద్రంలోని బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. మీరు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ కమిట్మెంట్ అర్థం చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని, ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని వారు ఇప్పుడు రోడ్లెక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు మహేష్ కుమార్ గౌడ్.