Durga Mata Idol Vandalised: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం పట్ల జరిగిన అపచారంకు బాధ్యుడైన కృష్ణయ్య గౌడ్ ను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహం ధ్వంసమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని కావాలనే ధ్వంసం చేశారన్న ఆరోపణలను పలు హిందూ సంఘాలు ఆరోపించాయి. ఈ కేసును త్వరితగతిన ఛేదించాలన్న లక్ష్యంతో సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడ్డ పోలీసులు అసలేం జరిగిందనే అంశాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ దర్యాప్తులో వారికి అసలు నిజం తెలిసింది.
ఈ క్రమంలో అమ్మవారి విగ్రహం పట్ల జరిగిన అపచారంకు బాధ్యుడిగా నాగర్ కర్నూల్ కి చెందిన కృష్ణయ్య గౌడ్ ను పోలీసులు గుర్తించారు. ఇతడిని బేగం బజార్ ఫిల్కాన్ చౌరస్తా వద్ద అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల మేరకు.. విగ్రహం ధ్వంసం చేశారంటూ కేసు అందిన వెంటనే తాము దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. అయితే విగ్రహం ఏర్పాటు చేసిన మండపం వద్ద నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని.. అందుకే నిర్వాహకునిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. కృష్ణయ్య గౌడ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అతను డిప్రెషన్ లో ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మవారి విగ్రహం ధ్వంసం కేసులో పురోగతి
మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ
నాగర్కర్నూల్కి చెందిన కృష్ణయ్యగౌడ్ను బేగం బజార్ ఫిల్కాన్ చౌరస్తా అరెస్ట్ చేసిన పోలీసులు
తనకు ఆకలిగా ఉండడంతో ఆహారం కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి వచ్చిన నిందితుడు… https://t.co/0R9M7EPKIV pic.twitter.com/n9Yc2lqKJJ
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2024
నిన్న రాత్రి బతుకమ్మ పండుగ జరిగిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు కృష్ణయ్య గౌడ్.. ఆకలితో వచ్చి, తనకు తినేందుకు ఎటువంటి ఆహారం దొరకక పోవడంతో అక్కడున్న వస్తువులన్నింటిని చిందరవందరగా పడవేశాడని, ఆ క్రమంలోనే విగ్రహం ధ్వంసమైనట్లు డిసిపి తెలిపారు.
కొందరు ఈ విషయాన్ని కావాలనే సోషల్ మీడియా ద్వారా పుకార్లు సృష్టించారన్నారు. అంతేకాకుండా మత విద్వేషాలు సృష్టించేందుకు పలువురు ప్రయత్నించారని, వాస్తవాలు తెలుసుకోకుండా అలా ప్రచారం చేయడం తగదన్నారు. అయితే సంచలనం కలిగించిన నాంపల్లి ఘటనలో భాద్యుడిని అనతి కాలంలోనే గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను, పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.