ఇంగ్లిష్ రాని చీఫ్ ఇంజనీర్..!
– శనివారమూ సాగిన ఘోష్ కమిషన్ విచారణ
– ఈఎన్సీ వెంకటేశ్వర్లు జవాబులపై ఘోష్ ఫైర్
– తప్పుడు సమాచారమిస్తే ఊరుకోనని వార్నింగ్
– ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశం
హైదరాబాద్, స్వేచ్ఛ : కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తు్న్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శనివారం ఆ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) నల్లా వెంకటేశ్వర్లుతో బాటు పలువురు అధికారులను విచారించింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు చెప్పిన జవాబులపై కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ ముందు అవాస్తవాలు చెబితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
తప్పుడు సమాచారమిస్తారా ?
శనివారం ఉదయం మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు విచారణకు రాగానే.. కమిషన్ చీఫ్.. మేడిగడ్డ సీకెంట్ ఫైల్స్ మీద ప్రశ్నలు ఆరంభించారు. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నల తర్వాత ‘ప్రత్యేకంగా మేడిగడ్డ బ్యారేజీకి సీకెంట్ ఫైల్స్ వాడమని మీకు ఎవరు సూచించారు?’ అని ప్రశ్నించారు. నాటి సీడీవో సీఈ సూచనల మేరకే తాము వాటిని వాడామని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. దీంతో పీసీ ఘోష్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సీడీవో సీఈ కేవలం డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ మాత్రమే ఇస్తారు. మిగిలిన విషయాల్లో వారు తలదూర్చరు. మేడిగడ్డకు సంబంధించిన ప్రతి ప్లాన్, డిజైన్ కమిషన్ వద్ద ఉన్నాయి. కావాలని తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు’ అని ఘోష్ హెచ్చరించారు.
ఇదేం పద్ధతి?
అనంతరం అదే ప్రశ్నను కొనసాగిస్తూ.. ‘మీరు చెప్పినట్లుగా ప్రత్యేక సీకెంట్ ఫైల్స్ వాడాలని సీడీవో సీఈ సూచిస్తే.. అందుకు ఏవైనా లిఖిత పూర్వక ఆధారాలిస్తారా?’ అని ప్రశ్నించారు. దీనికి వెంకటేశ్వర్లు మౌనం వహించటంతో ‘మీ ఇష్టం వచ్చినట్లు కమిషన్ ముందు సమాధానాలు చెప్తే మేము నమ్మాలా? నీకు కన్ఫ్యూజన్ ఉంటే నీ దగ్గరే పెట్టుకో.. కమిషన్ వరకు దానిని తీసుకురావద్దు’ అంటూ విచారణనకు కొద్దిసేపు ఆపేశారు. మళ్లీ మాట్లాడుతూ ‘ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదు. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని గుర్తుంచుకోండి’ అని అసహనం వ్యక్తం చేశారు.
అబ్బే.. అది కుదరదు
అయితే, తన సమాధానాన్ని సరిచూసుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరగా.. దీనికి అంగీకరించబోనని, తగిన దస్త్రాలు సమర్పిస్తే సవరించుకునే అవకాశం ఇస్తామని ఘోష్ స్పష్టం చేశారు. వెంటనే వెంకటేశ్వర్లు బదులిస్తూ, తనకు ఆంగ్లంపై పూర్తిగా పట్టు లేదని రికార్డులు చూసి చెబుతానని అనగా, ‘ఇంగ్లిష్ మీద పట్టు లేకుండానే కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్గా మీరెలా పనిచేశారు’ అంటూ ఘోష్ మండిపడ్డారు.