GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మీటింగ్ అన్నాక అధికార, విపక్షాల ఆందోళనలు కామనే. వీళ్లను వాళ్లు అంటారు.. వాళ్లను వీళ్లు అంటారు. మేయర్ పోడియంను చుట్టుముడతారు. నానా రచ్చ చేస్తుంటారు. పలుమార్లు సమావేశం వాయిదా పడుతుంటుంది. అనేకసార్లు విపక్ష సభ్యులు కౌన్సిల్ నుంచి బాయ్కాట్ చేస్తారు. ఇవన్నీ గతంలో చూసిన, తెలిసిన విషయాలే. కానీ….
ఈసారి GHMC మీటింగ్లో అనూహ్య ఘటన జరిగింది. విపక్ష కార్పొరేటర్లు కాదు.. ఏకంగా అధికారులే కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. అంతా షాక్. ప్రజాసేవకులైన అధికారులు.. ఇలా బాధ్యతారాహిత్యంగా బాయ్కాట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. GHMC చరిత్రలోనే తొలిసారిగా జరిగిందీ పరిణామం. ఇంతకీ అసలేం జరిగిందంటే…
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. మేయర్ చైర్ దగ్గరకు వెళ్లి ఆందోళన చేశారు. మేయర్ విజయలక్ష్మి వారించినప్పటికీ విపక్ష కార్పొరేటర్లు వినలేదు. వెనక్కి తగ్గలేదు. సభలో తీవ్ర గందరగోళం. విపక్ష కార్పొరేటర్ల తీరుకు నిరసనగా వాటర్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు సమావేశం నుండి వాకౌట్ చేశారు.
అవును, మీరు చదివింది నిజమే. వాకౌట్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులే. నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. అధికారులే బాయ్కాట్ చేయడంతో కార్పొరేటర్లు అవాక్కయ్యారు. కౌన్సిల్ మరింత రసాభాసగా మారడంతో.. సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు మేయర్ విజయలక్ష్మి.
GHMC కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు ఎలా బాయ్కాట్ చేస్తారు? సమస్యలపై నిలదీస్తే పారిపోతారా? అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్పొరేటర్లు. అధికారులున్నది సమస్యలను పరిష్కరించడానికి కాదా? డ్రైనేజీలో పడి చనిపోతున్నా అధికారులకు పట్టదా? ఆఫీస్ ముందు మట్టి పోసినందుకే మీకంత మంటగా ఉందా? సమస్యలపై నిలదీసినందుకే ఆత్మగౌరవం పొంగుకొచ్చిందా? జనం ఇళ్ల ముందు డ్రైనేజీ పొంగినప్పుడు ఏమైపోయారు? వాన పడితే కాలువలుగా కాలనీలు మారినప్పుడు ఎక్కడున్నారు? జనం గురించి ఆలోచించలేని అధికారులకు, ఆత్మగౌరవం గురించి అడిగే హక్కు ఉంటుందా? అంటూ నిలదీస్తున్నారు.