National Flag Hoist: ఏడాదికి రెండు సార్లు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఒకటి జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, కమ్యూనిటీ హాళ్లు, సంఘాలు, ఎన్నో చోట్లా దేశభక్తితో మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కానీ, హైదరాబాద్లోని నల్లకుంటలో మాత్రం ప్రతి రోజూ ఈ జాతీయ జెండా ఎగరేస్తారు.
కొరంటీ హాస్పిటల్ సమీపంలో సీనియర్ జర్నలిస్టు, రచయిత నేలంటి మధు సారథ్యంలో ప్రతి రోజు ఉదయం ఇక్కడ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. నిత్యజనగణమన ఫౌండర్ నేలంటి మధు ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవమైన నేటితో నిత్య జనగణమన కార్యక్రమం 829 రోజులు పూర్తి చేసుకుంది.
2022 మే 7వ తేదీన నిత్య జనగణమన కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కేంద్రంలో మూడవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నేడు నిర్వహించారు. నేటి స్వాతంత్ర్య దినోత్సవం చిన్నారుల మధ్య ప్రత్యేకంగా చేపట్టారు. పిల్లలు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో వచ్చి అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ హాజరై పతాకావిష్కరణ చేశారు. ఆ తర్వాత తన సందేశాన్ని వినిపించారు. జనగణమన ఫౌండర్ నేలంటి మధు తన సందేశాన్నిచ్చారు.
Also Read: CM Revanth Reddy: మామా అల్లుళ్లు చెల్లని కాసులే.. హరీశ్ రావుకు చీము నెత్తురు ఉంటే.. : సీఎం ఫైర్
ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ యాక్టివిస్ట్, సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ శాలిని జాదవ్, ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ అధ్యక్షుడు భాను ప్రసాద్ రెడ్డి, తదితరులు హాజరై ప్రసంగించారు.