GHMC General Body Meeting(Hyderabad news today):
జీహెచ్ఎంసీలో 8వ పాలకమండలి సమావేశం జరుగుతోంది. ముందుగా పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై కేంద్రానికి పాలక మండలి ధన్యవాదాలు తెలిపింది. అనంతరం ఈ ఏడాది బడ్జెట్ వివరాలను తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీ మొత్తం బడ్జెట్ రూ.8,437 కోట్లు అని, రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు మంజూరు చేసిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి జీహెచ్ఎంసీ మీటింగ్ కావడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీహెచ్ఎంసీ పాలక మండలిలో అధికార కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం 11 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నేతలు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చాలా మంది కార్పొరేటర్లు వీరి బాటలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది.
డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీలో కీలక వ్యక్తిగా కొనసాగారు. నగరంలోని బీఆర్ఎస్ నేతల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇప్పటికే పలువురు కార్పొరేటర్లతో మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ ఎత్తున చేరికలు ఉండొచ్చని తెలుస్తోంది. అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ సైతం బీఆర్ఎస్ కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్.
Read More : కారు బోల్తా.. ప్రభుత్వ విప్ కు తప్పిన ప్రమాదం
నేడు జరిగే సర్వసభ్య సమావేశంలో బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 8,437 కోట్ల రూపాయలతో బడ్జెట్ కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 1247 కోట్ల రూపాయలు అధికం. బడ్జెట్ ప్రవేశపెట్టగానే దానిపై చర్చ మొదలైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగించింది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ లోటును పూడ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే చేరికలపై ఫోకస్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ గూటికి చేరగా వారి ద్వారా మరింతమందిని ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తుంది.