Gandhi Bhavan PAC : హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ జరిగింది. పీఏసీ ఛైర్మన్ మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి పీఏసీ భేటీ ఇది. పీఏసీ భేటీలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే అంశంపై చర్చించారు.
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని ఠాక్రే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడ్డారని తెలిపారు. కాంగ్రెస్ విధానాలు, హామీలను ప్రజలు విశ్వసించారని అందుకే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి విజయం కల్పించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.
ఆర్థిక పరిస్థితిని పీఏసీ సభ్యులు వివరించారని షబ్బీర్ అలీ సమావేశ వివరాలను వెల్లడించారు. గ్రామసభలు నిర్వహించిన 6 గ్యారంటీలు వివరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. నీటి పారుదల రంగంలోనూ, మిషన్ భగీరథ పేరుతో జరిగిన అవకతవకలు గుర్తించామన్నారు. అన్ని అంశాలపై జనవరి 28 నుంచి కార్యాచరణ చేపడతామన్నారు.