Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్బాగ్ చౌరస్తా, జగ్జీవన్రామ్ విగ్రహం మీదుగా గన్పార్క్ వైపు అంతిమ యాత్ర సాగుతుంది.
అంతిమయాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం కాసేపు గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచుతారు. పాటలతో కళాకారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం గన్ పార్క్ నుంచి ఆల్వాల్ భూదేవినగర్లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకెళతారు. అనంతరం గద్దర్ అల్వాల్లో స్థాపించిన మహాబోధి విద్యాలయ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయం వద్ద కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గద్దర్ కు నివాళులు అర్పించారు.