Gaddar :ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అమీర్పేట అపోలో స్పెక్ట్రా హాస్పిటల్లో కొద్దిరోజుల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయనను పలువురు ప్రముఖులు పరామర్శించారు. కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ప్రాణాలు విడిచారు. గద్దర్ ఇకలేరని ఆయన కుమారుడు సూర్యం తెలిపారు.
గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన మెదక్ జిల్లా హన్మాజీపేటలో 1949 జూన్ 5న జన్మించారు. నిజామాబాద్ , మహబూబ్ నగర్ జిల్లాల్లో విద్యాభాస్యం సాగింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లను సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పెట్టి గద్దర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
గద్దర్ తన పాటలతో ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజాగాయకుడిగా గుర్తింపుపొందారు. “అమ్మ తెలంగాణమా..”, పొడుస్తున్న పొద్దుమీద..” పాటలు ఆయనకు ప్రజల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. మా భూమి సినిమాలో వెండి తెరపై మెరిశారు.
జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో గద్దర్ ప్రజా ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
1975లో కెనరా బ్యాంకులో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత ప్రజాగాయకుడిగా మారారు. పాటలు రాస్తూ గద్దర్ పేరుతో తొలి ఆల్బం విడుదల చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు గద్దర్ గా స్థిరపడిపోయింది. 1987లో కారంచేడు దళితుల హత్యలపై పోరాటం చేశారు. ఆయన నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం జరిగింది. అప్పుడు ఆయనపై కాల్పులు జరిగాయి. ఇప్పటికీ ఓ బుల్లెట్ గద్దర్ శరీరంలోనే ఉంది.