Gaddar: ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఇక భౌతికంగా మన మధ్య లేరు. జబ్బపై గొంగళి, చేతిలో కర్ర, ఎర్ర జెండాను ఎత్తుకున్న ఆ రూపం మనకిక కనిపించదు. పాటతో శాశ్వతంగా మన మదిలో నిలిచిపోతారు. పొడిచే ప్రతీ పొద్దులో ఆయన కనిపిస్తుంటారు. నడిచే కాలంలో కదలాడుతుంటారు. ప్రతీ చెల్లి పాదం మీద పుట్టుమచ్చయై.. మనతో పర్మినెంట్గా ఉంటారు.
సమ సమాజ స్థాపన కోసం గుమ్మడి విఠల్ రావు ఎన్నో కలలు కన్నారు. గద్దర్గా తన గళంతో జనవాణిని వినిపించారు. పాలకుల పెత్తనాన్ని ప్రశ్నించారు. అలాంటి, గద్దర్ స్వదస్తూరీతో లిఖించిన సిద్ధాంత వారసత్వపు వీలునామా మరింత ఆసక్తికరంగా ఉంది. మరింత ఉద్యమస్పూర్తిని రగిలిస్తోంది. ఇంతకీ ఆయన కలం నుంచి జాలువారిన చివరి అక్షరాలు ఏంటంటే….
“నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం మనుష్యులుగా గుర్తించబడరో.. అంతకాలం ఈ తిరుగుబాటు పాడుతూనే ఉంటాను. నా జాతి.. నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది”.
ఇదీ.. గద్దర్ తాను నమ్మిన.. తాను ఆచరించిన సిద్ధాంతం. తెలంగాణ గోస.. అక్రమ ఎన్కౌంటర్లు.. పీడిత పక్షాల అణచివేత ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యారు. తన గళంతో జనవాణిని పాలకులకు వినిపించారు.
సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మతో.. కీచకుల చేతిలో బలైన ఆడబిడ్డల గోసను వినిపించాడు. గొంగళి వేసుకొని మీ పాటనై వస్తున్నానమ్మో అంటూ.. తెలంగాణ పల్లెల్లో కలియ తిరిగాడు. పొడుస్తున్న పొద్దోలే.. అణిచివేతకు గురైన బతుకులకు పోరుబాట చూపాడు. పొద్దు తిరుగుడు పువ్వూ పొద్దును ముద్దాడే అంటూ.. చితికిన బతుకులకు తిరుగుబాటును నేర్పాడు. అమ్మా తెలంగాణమా అంటూ.. ఆకలి కేకల గానాన్ని వినిపించాడు.
గద్దర్ స్వప్నించిన ప్రత్యేక తెలంగాణ సాకారమైంది. కానీ ఆయన ఆశించని సామాజిక అసమానతలు, రాజకీయ రుగ్మతలు అలాగే ఉన్నాయి. వాటిని దూరం చేయడమే మనం ఆయనకిచ్చే ఘన నివాళి.