Bjp Kishan Reddy : తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తు ఎక్కడిది…
త్వరలోనే గులాబీలు బీజేపీతో జోడి కట్టనున్నారన్న ప్రచారంపైనా ఆయన స్పందించారు. ఆ పార్టీతో తాము కలిసేది లేదని తేల్చిచెప్పారు. ఈ మాట తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా చెబుతున్నానని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీది గడ్డు పరిస్థితి అని, ఈ మేరకు తిరిగి పుంజుకునేందుకు ఆ పార్టీ బీజేపీతో కలిసి నడవనుందన్న ప్రచారాన్ని కిషన్ రెడ్డి తెరదించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ఎవరూ పొత్తు కోసం తనను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
మేం అండగా ఉంటాం…
ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు కూల్చడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బాధితులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రెక్కాడితే గానీ డొక్కాడని చిన్న చిన్న వేతన జీవులు కష్టపడి, చెమటోడ్చి చిన్న స్థలాలు కొనుక్కుంటే, ఇప్పుడు వాటిని హైడ్రా పేరుతో ఎలా కూలుస్తారని ఆయన నిలదీశారు. అప్పుడేమో ప్రభుత్వమే అన్నీ అనుమతులు ఇచ్చి, ఇప్పుడేమో కూల్చేస్తామంటే ఏం పద్ధతని ప్రశ్నించారు.
మూసీకి రండి, మాట్లాడదాం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూసీ పరివాహిక ప్రాంతాల్లో పర్యటించాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు నిర్వాసితులను ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఇక కూల్చివేతలు అంత ఈజీ కాదని హితవు పలికారు. అక్రమ కూల్చివేతలను కూల్చడం కొత్త కాదని, గతంలో జీహెచ్ఎంసీనే కూల్చివేతలు చేపట్టేదని ఆయన గుర్తు చేశారు.
హైడ్రా అంటే భూతం కాదని, ప్రస్తుతం దాని పేరును మార్చారన్నారు. హైడ్రా కూల్చాలని భావిస్తే ముందుగా మూసీలోని బస్ డిపో, మెట్రో పిల్లర్లను కూల్చేయాలన్నారు. అంతేకానీ పేదవారి ఇళ్లు ఎలా పడగొడతారని, క్షేత్రస్థాయిలోకి సీఎం రావాలని, ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలన్నారు.
అవన్నీ మూసీలోనే కలుస్తున్నాయి…
మరోవైపు మూసీలో కలిసే మురుగునీరును ఎలా నిర్వహిస్తారో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మహానగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు మూసీలోనే కలుస్తోందన్నారు.
ఇక జమ్మూకాశ్మీర్ ఎన్నికలపైనా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. శాసనసభ ఎన్నికల్లో 98 శాతం హిందువుల ఓట్లు తమకే పడ్డాయన్నారు. కశ్మిరీ పండిట్లు మొత్తం తమకే ఓట్లేశారని, చిన్న అవాంతర సంఘటన లేకుండా దాదాపుగా 60 శాతం మేర ఓటింగ్ జరిగిందన్నారు. ఇక ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మకమని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఫేక్ నోట్లు నియంత్రించామని, ఉగ్రవాదాన్ని నిర్మూలించామన్నారు.
కఠిన చర్యల వల్లే…
ఐఎస్ఐపై ఉక్కుపాదం మోపామని, ఫలితంగానే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. మరోవైపు త్వరలో జార్ఖండ్లో ఎన్నికలు జరగనున్నాయని, అక్కడా తామే గెలవనున్నామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దాయాది పాకిస్థాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆహారం, ఆయుధాలను చైనా, పాకిస్థాన్కు సరఫరా చేస్తోందని ఆయన మండిపడ్డారు.
Also read : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్.. ఇక వారందరి కల నెరవేరినట్లే..