Rohini: కర్ణాటకలో ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్ మధ్య వివాదం రచ్చ రేపింది. కర్ణాటక ప్రభుత్వం ఇద్దరికీ షాకిచ్చింది. పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచింది ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరీ. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారిణి డి. రూప.. రోహిణిని మరో వివాదంలోకి లాగారు. రోహిణి సింధూరికి 19 ప్రశ్నలు సంధిస్తూ రూప ట్వీట్ చేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా రోహిణికి చెందిన ప్రైవేటు ఫొటోలను కూడా ఆమె విడుదల చేయడంతో మరింత దుమారం రేగింది. దీనిపై రోహిణి సింధూరి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఈ రోహిణి సింధూరి ఎవరు? ఆమె చుట్టూ నెలకొన్న వివాదాలేంటి?
1984లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లిలో జన్మించారు రోహిణీ సింధూరి. కర్ణాటకకు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. కర్ణాటకలో హసన్, మైసూర్ జిల్లాలకు కలెక్టర్గా పని చేశారు. రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ముజరాయి శాఖ కమిషనర్గా పని చేస్తున్నారు. గతంలో రోహిణి సింధూరి హాసన్ జిల్లాకి కలెక్టర్గా పని చేస్తున్న సమయంలో అప్పటి మంత్రి హెచ్డీ రేవణ్ణతో గొడవకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే రేవణ్ణ, రోహిణి మధ్య వాగ్వాదం జరిగింది. మైసూర్కు రోహిణి సింధూరి డిప్యూటీ కమిషనర్ గా ఉండగా కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నేనంటే .. నేనే గొప్ప అనేలా ఇద్దరూ వ్యాఖ్యలు చేసుకున్నారని వార్తలు వచ్చాయ.
సిద్ధరామయ్య ప్రభుత్వంలో కూడా రోహిణి పై వివాదాలు కొనసాగాయి. అప్పటి మంత్రి ఏ. మంజు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారంటూ.. ఆమె ఈసీకి లేఖరాశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. దీంతో.. ఇద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. మంత్రి ఎ. మంజు పట్టుబట్టడంతో.. రోహిణి సింధూరిని బదిలీ చేశారు. దీన్ని ప్రశ్నిస్తూ సింధూరి క్యాట్ తోపాటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె బదిలీపై హై కోర్టు స్టే విధించింది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో సీన్ మారిపోయింది. సింధూరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి రేవణ్ణ.. ఎట్టకేలకు ఆమెను జిల్లా నుంచి బదిలీ చేయడంలో సఫలీకృతులయ్యారు. సెప్టెంబర్ 2020లో రోహిణి సింధూరి మైసూర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. జూన్ 2021 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు. అప్పటి మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్తో కూడా రోహిణికి వాగ్వాదం జరిగింది. దీంతో.. ఇద్దరినీ మైసూర్ నుంచి బదిలీ చేసింది సర్కారు..
కరోనా సమయంలోనూ రోహిణీ సింధూరిపై వివాదాస్పద వార్తలు వచ్చాయి. ఆక్సిజన్ కొరతతో 24 మంది మరణించడానికి మైసూర్ జిల్లా కలెక్టర్గా ఉన్న రోహిణి సింధూరియే కారణమని చామరాజనగర్ జిల్లా కలెక్టర్ ఆరోపించారు. కరోనా నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఇంకా ఆ నిధులకు జిల్లా కలెక్టర్ను బాధ్యులను చేయాలని ఎంపీ ప్రతాప్సింహ బహిరంగంగా డిమాండ్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
కేఆర్ నగర్ ఎమ్మెల్యే సారా మహేష్తోనూ రోహిణి సింధూరికి విభేదాలు న్యూస్ హెడ్ లైన్స్ గా మారాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, కరోనా నేపథ్యంలో పనుల నిర్వహణ, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంతో వేలాది మంది ఇబ్బందులు పడ్డారని మహేష్ ఆరోపించారు. అంతే కాదు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టెస్టింగ్ నంబర్లలో మరణాలు తక్కువగా చూపిస్తున్నారని విమర్శించారాయన. అటు సారా మహేష్ పై రోహిణీ ఫైర్ అయ్యారు. మహేష్ అక్రమంగా భూములు పంచారని ఆరోపిస్తున్న రోహిణి సింధూరి ఆడియో వైరల్ గా మారింది. దీంతో.. ఆమెపై సారా మహేష్ పరువునష్టం కేసు కూడా పెట్టారు.
మైసూరు ఎంపీ ప్రతాప్ సింహాతోనూ రోహిణి సింధూరికి గొడవలు ఉన్నాయి. మైసూరు జిల్లాలో కరోనా మృతుల సంఖ్యలో వ్యత్యాసం ఉందని, దీంతో చాలా మందికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రోహిణి సింధూరిపై ఎంపీ ప్రతాప్ సింగ్ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. మైసూర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నివాసం ఒక వారసత్వ భవనం. అక్కడ కొత్త భవన నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ జిల్లా కలెక్టర్ గా ఉన్న రోహిణి సింధూరి దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, జిమ్ నిర్మించారని ఆరోపించారు. దీనిపై రోహిణి సింధూరి ప్రభుత్వానికి సమాధానం ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ నిర్మించడం అనేది 5 సంవత్సరాల నాటి ప్రాజెక్ట్ అని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రాక్టికల్ ప్రాజెక్ట్గా స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు స్పష్టం చేశారు.
ఆ తర్వాత కూడా సారా మహేష్ తో రోహిణి సింధూరి గొడవలు కొనసాగాయి. చేనేత కార్పోరేషన్ను వదిలి ప్రైవేట్ వ్యక్తికి టెండర్ ఇవ్వడంతో లబ్ధి పొందారని ఆమెపై.. ఎమ్మెల్యే సారా మహేశ్ ఆరోపించారు. ఎకో ఫ్రెండ్లీ క్లాత్ బ్యాగుల కొనుగోలు పేరుతో మొత్తం 14 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆయన.. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై రోహిణి కూడా దీటుగానే స్పందించారు. టెండరింగ్ నిబంధనల మేరకే జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
రోహిణి సింధూరి అంటే వివాదాలేనా .. అంటే కాదు. విప్లవాత్మక మార్పులకు కూడా కేరాఫ్ అడ్రస్ అని ఆమె పని తీరు చూస్తే అర్ధమవుతుంది. 2011 ఆగస్టు 29 నుంచి 2012 ఆగస్టు 31 వరకు తుమకూరులో అసిస్టెంట్ కమిషనర్గా ఆమె పని చేశారు. తర్వాత ఆమె మొదటిసారి సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. అదే సమయంలో తుమకూరు పట్టణాభివృద్ధి శాఖ ఇన్చార్జి కమిషనర్గా పని చేసిన ఆమె.. 2012 డిసెంబర్ 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. పన్నుల వసూళ్లను కంప్యూటరీకరించడం, కార్పొరేషన్ భూములను స్వాధీనం పరచుకోవడం, రద్దీగా ఉండే రోడ్లపై కూడా విజయవంతంగా రహదారి పనులు చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేశారు. తుమకూరులో ఆమె చేసిన పనులకు ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక 2014లో ఒక్క ఏడాదిలోనే మాండ్య జిల్లాలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు రోహిణి. దేశంలో అత్యధిక మరుగుదొడ్లు ఉన్న మూడు జిల్లాల్లో మాండ్య కూడా ఒకటి కావడం విశేషం. ప్రజలకు మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అని ప్రతిరోజు ఉదయం గ్రామస్తులను కలిసేవారు రోహిణి. ‘ముంజనే’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.