తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం హామీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఒక్కొక్కదానిని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ముందుగా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రేపటి నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించనుంది. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై నేడు సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ కానున్నారు.
ముఖ్యమంత్రితో సమావేశానికి అందుబాటులో ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఇప్పటికే సమాచారం అందింది. దీంతో ఇవాళ రేవంత్రెడ్డితో సమావేశం కానున్నారు సజ్జనార్. ఈ భేటీలోనే ఆర్టీసీ ప్రయాణానికి సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం మార్గదర్శకాలతో కూడిన పూర్తిస్థాయి ప్రకటన వెలువడనుంది. ఏఏ బస్సుల్లో మహిళలను అనుమతిస్తారు, ప్రయాణ పరిధి ఎంత, ప్రయాణించే వారు ఏఏ గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుందనేది మార్గదర్శకాల్లో వెల్లడిస్తారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. దీనికోసం ఇప్పటికే కర్ణాటకకు వెళ్లి అధికారులు పర్యటించారు. అక్కడ ఎలా అమలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. ఆర్టీసీ సంస్థ ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం కర్ణాటకకు వెళ్లింది. ఆ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుతీరు, సంస్థపై ఆర్థిక ప్రభావం, ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం వంటి వివరాలు అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్కు ప్రాథమిక సమాచారం అందించారు. దీనిని సీఎం రేవంత్ముందు ఉంచనున్నారు సజ్జనార్.
కర్ణాటక ప్రభుత్వం జూన్ నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తోంది. ఆ రాష్ట్రంలో 22 వేల పైగా బస్సులున్నాయి. తెలంగాణలో బస్సుల సంఖ్య 8 వేల 5వందకు పైగా ఉంది. ప్రస్తుతం కర్ణాటక బస్సుల్లో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ప్రయాణిస్తున్నారు. పథకం అమలుకు ముందు బస్సుల్లో మహిళల సంఖ్య 40 నుంచి 41 శాతంగా ఉండేది. పథకం అమలు తర్వాత 12 నుంచి 15 శాతం వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆ ప్రకారం బస్సుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆర్డీనరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో అమలుచేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర వాసులకే ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నారు. దీనిని ఆ రాష్ట్ర పరిధికే పరిమితం చేశారు. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచితం వర్తించదు.
మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలుచేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సర్కార్ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలుచేయనున్నారు. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12 నుంచి 13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోంది. సగటున రోజుకు 14 కోట్ల రూపాయల రాబడి వస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారు. 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు అధికారులు.