Latest news in telangana(Telugu breaking news): తెలంగాణ రాజకీయం మొత్తం వ్యవసాయ విద్యుత్ చుట్టే తిరుగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలతో రాష్ట్రంలో విద్యుత్ మంటలు అంటుకున్నాయి. ఒక్కసారి తెలంగాణ వ్యవసాయ విద్యుత్ రంగం గణాంకాలను పరిశీలిద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 53 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. మొత్తం 26 లక్షల పంపుసెట్లు కూడా ఉన్నాయి. అయితే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. గ్రౌండ్ లో జరిగేది మరొకటి. పేరుకు మాత్రమే 24 గంటల కరెంట్.. కానీ పీక్ అవర్స్ లో రైతాంగం విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. గత రబీ సీజన్ లో రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టిన సందర్భాలు కోకొల్లలు. విద్యుత్ ఇవ్వాలంటూ సబ్ స్టేషన్లను కూడా ముట్టడించిన సందర్భాలను మనం చూశాం. అంతేకాకుండా వ్యవసాయ కనెక్షన్లకు సర్వీస్ చార్జ్ పేరుతో అధికారులు వసూళ్లకు పాల్పడ్డారు. రైతులు పొలాల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ స్టార్టర్లను కూడా లాక్కెళ్లారు.
24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపించాలని విపక్షాలు ఇప్పటికే సవాళ్లు విసురుతున్నాయి. ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. త్రీ ఫేజ్.. ఫ్రీ కరెంట్ ఉందని నిరూపిస్తే.. పోటీకి దూరంగా ఉంటానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. త్రీ ఫేజ్ కరెంట్ ఒకే టైంలో ఇస్తుండటంతో లో వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయి. దీంతో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు, కాలిపోతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 2017 డిసెంబర్ 31 నుంచి 24 గంటల ఉచిత విద్యుత్ కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 2021-22 బడ్జెట్ లో 10వేల 500, 22-23 ఆర్థిక సంవత్సరంలో 12వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 23-24 ఫైనాన్షియల్ ఈయర్ లో 12వేల కోట్లు కేటాయింపులు చేసింది. ఇక దేశంలోని పంజాబ్, హర్యానాల్లోనూ రైతులకు ఉచిత విద్యుత్ అందుతోంది. అయితే అక్కడ కరెంట్, నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక మెకానిజం పనిచేస్తుంది. అదే తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ప్రభుత్వ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది.