CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం దేశ రచనలు మరో అడుగు ముందడుగు వేసింది. దేశ రక్షణలో ఇప్పటికే హైదరాబాద్ నగరం కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకోగా తెలంగాణకు మరో ఘనత దక్కింది. దేశంలోనే తొలి రాడార్ స్టేషన్ తమిళనాడులో ఉండగా.. రెండవ స్టేషన్ తెలంగాణలో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ ను ఏర్పాటు చేసేందుకు 2,935 ఎకరాల భూములను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అటవీ అధికారులు.. నేవీ శాఖ అధికారులకు అందజేశారు. దీనితో 14 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసి దేశ రక్షణలో తామెప్పుడు ముందుంటామని నిరూపించుకుంది.
కాగా రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతోనే ఇక్కడ దేశంలోనే రెండవ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దేశ భద్రత విషయంలో నేవి కీలక పాత్ర పోషిస్తుందని.. ఇక్కడి రాడార్ స్టేషన్ నిర్మాణం ద్వారా సబ్ మెరైన్ లతో కమ్యూనికేషన్ బలపడుతుందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు తగదని, సీఎం రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది అంటూ.. సీఎంకు అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం మాట్లాడుతూ.. ఇక్కడి రాడార్ ప్రాజెక్ట్ ఏర్పాటు పట్ల ప్రజలకు పలువురు అపోహలు కల్పించారని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు రాష్ట్రంలో 34 ఏళ్లుగా రాడార్ స్టేషన్ నిర్మితమై ఉందని, అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాన్ని కూడా రాజకీయం చేయాలని, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినట్లు పరోక్షంగా సీఎం అన్నారు. పదేళ్లు అబద్ధాలు చెప్పారు.. ఇప్పుడు కూడా దేశ అంతర్గత భద్రత విషయంలో అవే అబద్ధాలు చెబుతూ.. స్థానిక ప్రజలను ఏం మార్చే ప్రయత్నం కొందరు చేశారన్నారు.
Also Read: IAS officers: క్యాట్లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!
ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం తగదని, తెలంగాణ అభివృద్ధి కోసం తాను ఎప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరికీ సహకరిస్తానన్నారు. దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేసిందని, ఇప్పటికే హైదరాబాద్ దేశ రక్షణకు సంబంధించిన అన్ని అంశాలలో ప్రాధాన్యత పొందడం తనకు ఆనందంగా ఉందన్నారు. అలాగే తెలంగాణలో కేంద్రం ఇన్స్టిట్యూట్ లను ఏర్పాటు చేయడం ద్వారా.. తమ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత శక్తి దేశానికి ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నారు. దేశభద్రత, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తానెప్పుడు పార్టీలకతీతంగా సహకరిస్తానంటూ కేంద్ర మంత్రికి సీఎం హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రి కొండా సురేఖ, స్పీకర్ ప్రసాద్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు.