Food Poison : రోడ్డు పక్కన ఘుమఘుమలాడే స్ట్రీట్ ఫుడ్ సువాసనలు ముక్కు పుటాలను తాకగానే.. తెలియకుండానే అటుగా అడుగులు పడిపోతాయి. స్ట్రీట్ ఫుడ్ లో పిజ్జా, బర్గర్, షవర్మ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇటువంటి ఫుడ్స్ లో వెన్నపూసలా కనిపించే మయోనైజ్ లేకపోతే ఉప్పు లేని కూరలా అనిపిస్తుంది స్ట్రీట్ ఫుడ్ లవర్స్కి. కానీ.. తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మయోనైజ్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయట.
తాజాగా వెన్నపూసలా కనిపించే మయోనైజ్.. హైదరాబాద్ అల్వాల్లోని లోతుకుంట గ్రిల్ హౌజ్ హోటల్ నిర్లక్ష్యంతో విషంలా మారింది. షవర్మతో కలిపి మయోనైజ్ను ఆరగించిన వారు వాంతులు, విరేచనాలు, తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఐదు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలో కలకలం రేపుతోంది. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి ఆ సంఖ్య 17కి పెరగడంతో స్థానికంగా పరిస్థితులు వేడెక్కుతున్నాయి.
ఘటనకు సంబధించిన వివరాలను అల్వాల్ ఇన్స్పెక్టర్ రాహుల్దేవ్ వెల్లడించారు. లోతుకుంట పరిధిలోని గ్రిల్హౌజ్ హోటల్లో ఈనెల 12న షవర్మ తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. 13 మంది బాధితులు కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురు సుచిత్రలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతా ఒకే రకమైన సమస్యతో బాధపడుతున్నారని.. ఆస్పత్రిలోని బాధితులకు రక్త పరీక్షలు నిర్వహించారు.
రక్తంలో హానికర సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ అయిందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వైద్య నివేదిక ఆధారంగా బాధితులు కలుషిత ఆహారంతోనే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రిల్హౌజ్ హోటల్ నిర్వాహకుడు తౌఫిక్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధితులను అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరామర్శించారు.
మండి బిర్యానీ, కబాబ్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్ల పై మయోనైజ్ను రాసుకుని తింటున్నారు. సాధారణంగా.. గుడ్డులోని పచ్చసొన, నిమ్మ రసం, నూనెతో మయోనైజ్ తయారుచేస్తారు. ఈ క్రమంలో.. హోటల్ సబ్బంది శుభ్రతను పాటించట్లేదు. అలా దాన్ని తింటే అనారోగ్యం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా తయారైన మయోనైజ్ను కూడా సుమారు నాలుగు గంటల్లోపు వాడేయాలని, అంతకు మించి నిల్వ ఉంచిన కోడిగుడ్డు మయోనైజ్ విషంలా మారొచ్చని ఎఫ్ఎస్ఓ లక్ష్మీకాంత్ వివరించారు. జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్రెడ్డిని వివరణ కోరగా.. మయోనైజ్తో చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని, ప్రతినెలా ఒకట్రెండు ఫిర్యాదులు నమోదవుతున్నాయన్నారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిర్లక్ష్యంగా వ్యహరిస్తోన్న హోటళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు.