Khammam : ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వరదతో మున్నేరు ఉప్పొంగింది. వరద ఉధృతి అమాంతం పెరిగిపోయింది. నదీకి అనుకుని ఉన్న శివారు గ్రామాలతో పాటు ఖమ్మం నగరంలో ఉన్న పలు కాలనీలను జలదిగ్భందంలో చిక్కుకుపోయాయ్. అసలు ఖమ్మంలో ఈ పరిస్థితికి రావడానికి కారణమేంటి? కాలనీలలో నీళ్లు వచ్చే పరిస్థితి గతంలో లేదు. కానీ ఇప్పుడు ఏకంగా నడుములోతు నీరు చేరడం ఆందోళన కలిగిస్తోంది. వైకుంఠదామం పూర్తిగా నిండిపోయింది.
మున్నేరు నదికి ఎగువ నుంచి రాత్రికి రాత్రే గతంలో ఎన్నడూ లేని విధంగా 30 అడుగుల మేర వరద వచ్చింది. దాంతో చాలా కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. లోతట్టు ప్రాంతాల వాసులకు కన్నీరు మిగిల్చింది. ఎగువన వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో కురిసిన భారీవర్షాలతో నీరంతా మున్నేరును చేరడంతో ఖమ్మం నగరం, ఖమ్మంరూరల్, చింతకాని, ముదిగొండ, మండలాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.
మున్నేరు నదికి ఆనుకున్న దానవాయిగూడెం, రామన్నపేట, పద్మావతినగర్, గణేశ్నగర్, ఎఫ్సీఐ గోదాముల ప్రాంతం, సారథినగర్, జూబ్లీపుర, కాల్వొడ్డు, బొక్కలగడ్డ, మోతీనగర్, ప్రకాశ్నగర్ ప్రాంతాల్లోని వేలాది ఇళ్లల్లోకి వరద నీరు ప్రవేశించింది. వైకుంఠదామం పూర్తిగా మునిగిపోయింది. సారథినగర్లో కలెక్టర్ క్యాంపు కార్యాలయం వెనుక ప్రాంతంలోని వీధుల్లోకి వరద నీరు చేరింది. 2004లో అత్యధికంగా మున్నేరుకు 25 అడుగుల వరకు వరద రాగా తాజాగా 30.70 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఖమ్మం వద్ద 6.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రకాశ్నగర్ వద్ద హైలెవల్ వంతెన పైకి వరద నీరు చేరింది. వంతెన పరిసరాల నుంచి నీరు రోడ్డుపైకి.. అక్కడి నుంచి వంతెన పైకి ప్రవహిస్తోంది. ప్రకాశ్నగర్ వంతెనపై వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో ప్రధాన రహదారిపై నీరు చేరటంతో ప్రకాశ్నగర్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి.