తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరుణుడి సృష్టించిన బీభత్సాన్ని యావత్ ప్రపంచం చూసింది. వరద ఉద్ధృతికి ఒక్కసారిగా ఊరి ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బిల్డింగులు, చెట్లపైకి ప్రజలు ఎక్కిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే గ్రామంలో వర్షం తగ్గినా అక్కడి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడంలేదు. వరద కూడా తగ్గుముఖం పట్టినా.. గ్రామంలో దయనీయపరిస్థితులున్నాయి.
గురువారం పునరావాస కేంద్రాలకు వెళ్లిన గ్రామస్థులు.. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు వెళ్తున్నారు. అక్కడ పరిస్థితి చూసి బోరున విలపిస్తున్నారు. చనిపోయిన, వరదకు కొట్టుకుపోయిన మూగ జీవాలను తలుచుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం అలసత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే.. తమ గ్రామానికి ముంపు ప్రమాదం ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. మోరంచపల్లి ప్రస్తుతం స్మశానాన్ని తలపిస్తుంది. కొట్టుకుపోయిన వస్తువులు, ఎక్కడికక్కడ చనిపోయిన మూగ జీవాలతో స్మశానాన్ని గుర్తు చేస్తోంది. ఇక గ్రామంలో చాలా మందికి కట్టుబట్టలు తప్ప ఇంకేం మిగలలేదు. ఇంట్లో సామాన్లు కూడా వరదకు కొట్టుకుపోయాయి. పేరుకే ఊరు మిగిలింది కానీ.. ఊరులో ఏం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.