Fire Accident : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఈ భవనం మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ నెల 17న కొత్త సచివాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవన నిర్మాణ పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడం విశేషం. ఇటీవల కొత్త సచివాలయాన్ని సందర్శించి పనులు ప్రగతిని తెలుసుకున్నారు సీఎం. ప్రారంభోత్సవం నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
హుస్సేన్ సాగర్ పక్కన… ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ప్రదేశంలోనే 2019 జూన్లో సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం కోసం పునాది రాయి వేశారు. మొత్తం 26.29 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ కలిపి మొత్తం ఏడు అంతస్థులు ఉంటాయి. ఈ కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం అని పేరు పెట్టారు.