Hyderabad: నగరంలో మరోసారి అలజడి రేగింది. సికింద్రాబాద్లోని నల్లగుట్ట పరిధిలో భయానక పరిస్థితి నెలకొంది. షాపింగ్ కాంప్లెక్స్లో ఉదయం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు సమీపంలోని మరో నాలుగు భవనాలకు అంటుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 11 గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. రూబీ హాటల్ ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.
నల్లగుట్ట ప్రాంతంలోని ఆరంతస్తుల భవనం సెల్లార్లోని గోదాంలో షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రమంగా మంటలు భవనాన్ని చుట్టుముట్టాయి. భవనంలో చిక్కుకున్న జనాలు కాపాడాలంటూ అరుపులు, కేకలు వేయగా మరికొందరు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా బటయకు తీసుకొచ్చారు. ఇద్దరి ఆచూకీ మాత్రం తెలియాల్సి ఉంది. ఉదయం 11 గంటల నుంచి ఫైర్ సిబ్బంది దాదాపు 40 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. భవనంలో ప్లాస్టిక్ వస్తువులు, రసాయనాలు ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
ప్రమాదం జరిగిన భవనంలోని ఒకటి, రెండు అంతస్థుల స్లాబులు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భవనం పూర్తిగా కూలిన ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి రసాయనాలతో మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలం వైపు ఎవరూ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అయితే ఫైర్ సేఫ్టీ నిబంధనలను భవన యజమానులు పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. నిబంధనలు కఠినంగా అమలుచేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. నగరంలో ఇప్పటికే ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ అధికారులు నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.