Fire Accident: ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు మెట్రో స్టేషన్కు పక్కనే గల దత్తసాయి కాంప్లెక్స్లో ఈ అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. నాలుగో అంతస్తులో ప్లాస్టిక్ గోడౌన్ ఉన్నది. ఈ అంతస్తులోనే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. తొలుత మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని, ఆ తర్వాత అవి ఒక్కటో అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాప్తి చెందాయని చెబుతున్నారు. ఈ కాంప్లెక్స్లోనే ఫర్నీచర్ స్టోర్ కూడా ఉండటంతో మంటలు మరింత వేగంగా ఎగిసిపడుతున్నాయి. కనీసం గంట సేపటి నుంచి ఈ మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఫైర్ బ్రిగేడియర్లు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను కంట్రోల్ చేసే పనిలో ఉన్నాయి.
దత్తసాయి కాంప్లెక్స్లో టపాడియా డయాగ్నోస్టిక్ కూడా ఉన్నది. అందులో ఉన్న వారిని సురక్షితంగా కిందికి దింపేశారు. మంటలు వ్యాపించినప్పుడు ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకోగా ముందు నుంచి అద్దాలు ధ్వంసం చేసి నిచ్చెన సహాయంతో వారిని రెస్క్యూ టీం కిందికి సురక్షితంగా తీసుకువచ్చినట్టు పోలీసులు చెప్పారు. చుట్టుపక్కల నివాసాలు ఉండటంతో వారంతా భయపడుతున్నారు.
మెట్రో స్టేషన్ పక్కనే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఉండటంతో ప్రయాణికులు కూడా భయాందోళనలకు గురయ్యారు. దీంతో మరోవైపు ఉన్న మెట్ల ద్వారా మాత్రమే వారిని కిందికి వెళ్లడానికి అనుమతించారు. ముషీరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను వేరే మార్గాల ద్వారా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ కాంప్లెక్స్లోకి ఎంట్రీ, ఎగ్జిట్ ఒకే పాయింట్ ద్వారా జరుగుతున్నది. కాబట్టి, లోపల ఎక్కువ మంది చిక్కుకుని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ, లోపల ఇద్దరు వ్యక్తులు ఉంటే వారిని బయటికి తీసుకువచ్చామని, లోపల మానవ నష్టమేమీ జరగలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, షార్ట్ సర్క్యూట్ అనుమానాలను కొట్టిపారేయలేమని వివరించారు. ముందుగా మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువస్తే.. ఆ తర్వాత ఈ ఘటన ఎలా జరిగిందనేదానిపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని తెలిపారు. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేవు. రెండో సారి మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది మరింత ఫోకస్ పెడుతున్నారు. మంటలు అదుపులోకి రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉన్నదని స్థానికులు చెబుతున్నారు.