Fire Accident in Hyderabad(Latest news in Hyd): హైదరాబాద్లో ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జియాగూడలో ఓ ఫర్నిచర్ గోడౌన్ లోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. 10 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్సుంపుర జియాగూడలోని వెంకటేశ్వర కాలనీలో ఓ సోఫా తయారీ గోదాంలో తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సమయంలో భవనంలో 20మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందరిని నిచ్చెన సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు.
అయితే ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. శ్రీనివాస్ తోపాటు భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే 80శాతం గాయాలతో శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ మృతి చెందింది ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. భవనంలో ఉన్న మూడో అంతస్తు నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ భవనంలో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొస్తున్నారు.
Also Read: 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. రిటర్న్ గిఫ్ట్ గుండు సున్నేనా ..?: మధుయాష్కీ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్ని మాపక సిబ్బంది నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున అంతమంది గోదాంలో ఎందుకు ఉన్నారు. వారంతా ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇళ్ల మధ్యలో అనుమతి లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు సమాచారం.