Firangi Nala: ఫిరంగినాలా…..ఏమిటి ఈ ఫిరంగినాలా దీనికంత ప్రత్యేకత ఉందా…….గత కొన్నేల్లుగా వానాకాలంలో ఓల్డ్ సిటిని వనికిస్తున్న వరదలకు దీనికి సంబందం ఏంటి ? నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం చెరువుకు దీనికి ఉన్నలింకేంటి ? చేవెల్ల నుంచి ఇబ్రహీంపట్నం వరకు దీని గురించి ఎందుకు చెప్పుకుంటారు? దీని వెనక ఉన్న చారిత్రక ప్రాధాన్యత ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.హైదరాబాద్ జలజీవధారకు మూలమేంటి? అసలు భాగ్యనగరానికి నీళ్లెక్కడి నుంచి వస్తాయి? ఫిరంగి నాలా గురించి మీకు తెలుసా? కనీసం గూగుల్ లో మనం వెదికితే .. దాని ఆనవాళ్లేమైనా కనిపిస్తాయా? ఓ సారి మనం చూద్దాం.
ఫిరంగి నాలా అంటే ఒక మురికి కాలువేనా? అంతకు మించి దీనికేమైనా చరిత్రుందా. అసలు అదెక్కడుంది? దాని ప్రాశస్త్యమేంటి? అది 1869 నాటి కాలం. నిజాం రాజు అఫ్జలుద్దౌలా చనిపోయారు. అప్పటికి అతని వారసుడు మీర్ మహబూబ్ అలీఖాన్ వయస్సు కేవలం రెండేళ్లే. తండ్రిని కోల్పోయిన నవాబు పిల్లాడు కావడంతో.. రాజ ప్రతినిధిగా పాలనాబాధ్యతా అంతా నాటి ప్రధాని.. మొదటి సాలార్ జంగ్ నిర్వహించేవారు. నిజాంకాలంలో ఎన్నో సంస్కరణలకు పితామహుడు సాలార్ జంగ్. ఆయన ముందుచూపుకు , దార్శనికతకు ఓ మచ్చుతునకే ఈ ఫిరంగినాలా.
నాటి కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం నీటి ఎద్దడిని ఎదుర్కొనేది. ముఖ్యంగా ఇక్కడి సాగు రుతుపవన ఆధారితం. ఒక ఏడాది వర్షాలు బాగుంటే మరో ఏడాది ఎలా ఉంటుందో తెలియని పరిస్ధితి.హైదరాబాద్ తూర్పు ప్రాంతమైన ఇబ్రహీంపట్నం..ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో నీటి కరువు తీవ్రంగా ఉండేది. తాగు నీటికి, సాగు నీటికి ప్రజలు ఇబ్బంది పడేవారు.తరచూ కరువు కాటకాలతో సతమతమయ్యేవారు. ఇబ్రహీంపట్నం చెరువు ఉన్నా అది ఎప్పుడో తప్ప నిండేదికాదు. ప్రజల ఇక్కట్లను గమనించిన సాలార్ జంగ్ దీనికి పరిష్కార మార్గం కోసం.. నిపుణులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అధ్యయనం చేయించారు.
సాలార్ జంగ్ నియమించిన నిపుణుల బృందం అనేక ప్రాంతాలు తిరిగి.. అక్కడి పరిస్థితులు, దానికి కారణాలు అన్వేషించారు. చివరకు అనంతగిరి కొండల్లో పుట్టి చుట్టు పక్కన ఉన్న వాగులు వంకలను కలుపుకొని ఉదృతంగా ప్రవహించే.. ఈసి నదిని పరిష్కార మార్గంగా తేల్చారు. మూసి నది ఉపనదిగా ఉన్న ఈసీ.. అడవుల గుండా స్వచ్చమైన అమృతధారలతో ప్రవహించేది. అనేక ప్రాంతాలగుండా ప్రవాహాన్ని తీసుకెళ్లి హిమాయత్ సాగర్ లో కలిసేది. అయితే దీని ఉధృతి చాలా ఎక్కువ. వర్షాకాలంలో బీభత్సం సృష్టించేది. దీంతో.. ఈ నీటిని వృధా చేయకుండా కరువు ప్రాంతాలకు ఉపయోగిస్తే.. నీటి ఎద్దడి తొలగి పోవడమే కాకుండా .. వర్షాకాలంలో వరద బీభత్సం నుంచి హైదరాబాద్ ను రక్షించవచ్చు అని ఈ నిపుణుల బృందం .. సాలర్ జాంగ్ కు నివేదిక ఇచ్చింది. అందులో ఈసి నది ప్రవాహాన్ని రెండుగా మళ్లించి.. ఒక కాలువతో కరువుప్రాంతాల గొంతు తడపాలని .. మరోకాలువ గుండా నీటిని హిమాయత్ సాగర్ కు యధావిధిగా పోయేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకు ఈసీ నదిని ప్రవాహాన్ని చానలైజ్ చేయడమే మార్గంగా తీర్మానించారు .
ఈసి నది నీటిని చానలైజ్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. నదీ ప్రవాహ ఉధృతిని తట్టుకునే కి అనువైన ప్రాంతం కావిల. దీనికోసం అనేక బృందాలు .. మళ్లీ అన్వేషించాయి. ఈ వెతుకులాటకు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన వెల్లి గ్రామం పరిష్కారంగా తోచింది. దీంతో .. సాలార్ జంగ్ .. ఫిరంగి నాలా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఫ్రెంచ్, బ్రిటీష్ ఇంజనీర్ల పిలిపించి.. డిజైన్ చేయించారు. వారి పర్యవేక్షణలో చందనవెల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 160 లో ఈసీ నదిని చానలైజ్ చేసేందుకు .. భారీ కట్టను నిర్మించారు. అదే మనం చూస్తున్న ఈ ఫిరంగి నాలా, ఈసీ నాలాలు. దీన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయించారు. నిర్మాణ పనులన్ని 1872 వరకు పూర్తయ్యాక.. ప్రజలకు అంకితం చేసారు.
1872 ప్రారంభమైన ఈ ఫిరంగినాలా అద్డుతమైన ఇంజనీరింగ్ పనితనానిక ఒక మచ్చుతునక. స్థానికులు దీన్ని కార్నాలకట్టగా పిలుచుకుంటారు. పూర్తి రాతికట్టడంతో నిర్మించిన ఫిరంగినాలా కట్టపొడవు అరకీలోమీటర్.వెడల్పు రెండున్నర మీటర్లు. కట్ట కిందివైపున అనేక తూములు ఉన్నాయి. ఈ తూములను తెరవడానిక మూయడానికి వీలుగా కట్టపైనుండి చెక్కలకు బిగించబడ్డ ఇత్తడి ఫలకలు ఉండేవి. కట్ట ఎక్కెందుకు .. దిగేందుకు మెట్లను కూడా నిర్మించారు. ఫిరంగినాలా నుండి నీటిని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం వరకు పంపెందుకు 48 అడుగుల మేర వెడల్పుతో 85 కిలోమీటర్ల పొడవుతో..ఒక కాంటూర్ కెనాల్ ను నిర్మించారు. ఫిరంగినాలా నుండి వచ్చే నీరు ఈ కాంటూర్ ద్వారా సోలిపేట పెద్ద చెరువు, చందన్వెల్లి చెరువు, రామంజపూర్ చెరువు పాలమాకుల చెరువు, శంషాబాద్ చెరువు, , ఇంజపూర్ చెరువు, కొత్తచెరువుమొదలుకొని ఇబ్రహీంపట్నం చెరువు వరకు దాదాపు 85 కిలోమీటర్ల మేర పారుతుంది. కాలువ పరిధిలో ఉన్న దాదాపు 25 పెద్ద చెరువులు, అనేక చిన్న చెరువులను నింపుతూ ఫిరంగి నాలానీరు ఇబ్రహీం పట్నం చెరువుకు చేరేది.