Farmer Suicide: అతను సెల్ టవర్ మీద ఉన్నాడు. ఇద్దరు చిన్నారులు డాడీ.. డాడీ.. దిగండి డాడీ.. అంటూ కింద ఏడుస్తున్నారు. ఆకాశం వైపు చూస్తూ.. అంతెత్తులో సరిగ్గా కనిపించని తండ్రిని వేడుకుంటున్నారు. ఆ చిన్నారుల మొరకు ఆ తండ్రి మనస్సు మారినట్టు లేదు. అతని పిల్లల పిలుపు.. ఆ తండ్రికి వినిపించిందో లేదో. కాసేపటికే.. సెల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తండ్రి. కన్నపిల్లల సాక్షిగా ప్రాణాలు వదిలిన అతని ఉదంతం కన్నీరు పెట్టిస్తోంది. కామారెడ్డి జిల్లాలో జరిగిందీ దారుణం. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్టవర్ ఎక్కి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు.
అసలేం జరిగిందంటే..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట కాలువ నీరు వెళ్తుండటంతో పరిహారం చెల్లించాలని కొన్నేళ్లుగా అధికారులకు, గ్రామస్థులకు మొర పెట్టుకుంటున్నాడు ఆంజనేయులు. తన సాగు దెబ్బతింటోందంటూ బాధపడేవాడు. రెండేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్.. అతని భూమికి 2వేలు పరిహారం ఇప్పించాడు. గత ఏడాది రైతులు ఎవరూ చెరువు కింద పంటలు సాగు చేయకపోవడంతో పరిహారం అందలేదు. ఈసారి మళ్లీ పంట సాగుకు సిద్ధమవడంతో.. మళ్లీ పంట నీళ్లు తన పొలం గుండా పోతాయంటూ మనస్తాపం చెందాడు ఆంజనేయులు.
తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫోన్ టవర్ ఎక్కాడు ఆంజనేయులు. ఎమ్మార్వో, ఎస్సైలు అతనితో ఫోన్లో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ రైతు వినలేదు. ఎస్పీ, డీఎస్పీ ఇక్కడికి రావాలని పట్టుబట్టాడు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఎంత చెప్పినా వినకుండా.. టవల్ తో సెల్ టవర్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లల కళ్లముందే తండ్రి ఉరి వేసుకొని చనిపోవడం చూసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.