Fake Visas : గల్ఫ్ దేశాలకు వలసల్లో టాప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. జిల్లాల పునర్విభజన తర్వాత ఆ ట్యాగ్ను జగిత్యాల జిల్లా సొంతం చేసుకుంది. బతుకు పలస బారి వలస పోతుంటే ఏజెంట్లు వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేస్కొని చెలరేగిపోతున్నారు. మొన్న ఫేక్ పాసపోర్టులు కలకలం రేపితే.. నేడు నకిలీ వీసాల దందా బయటపడింది. ఏళ్ల తరబడి జరుగుతున్న నకీలీ పాస్ పోర్టు, వీసాల దందా.. ఒక్కసారిగా వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తుంది.
కోరుట్లలో నకీలీ పాస్పోర్టు ఏజెంట్ల ఇంట్లో.. సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్టు చెయ్యటంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా.. నకిలీ పాస్పోర్టులు.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్పోర్ట్ దందా మరువక ముందే మెట్ పల్లి లోని ఓ గల్ఫ్ ఏజెంట్.. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకి చెందిన వారికి నకీలీ వీసాలు ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇది వరకు వచ్చిన వీసాలో ఫోటోలు, పేర్లు మార్చి.. నకీలీ వీసాలను తయారు చేసినట్లు సమాచారం. సుమారు 60 మందికి ఇవి అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీసాలు పొందిన చాలామంది వ్యక్తులు.. ఎయిర్ పోర్ట్ వరకూ వెళ్లాక నకీలీ వీసాలని తేలటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నకీలీ వీసాలు పొందిన చాలా మంది బాధితులు మెట్ పల్లిలోని గల్ఫ్ ఏజెంట్ ఇంటి ముందు ఆందోళనకి దిగారు.
పోలీసులు లైసెన్స్ లేని గల్ప్ ఏజెంట్ల విషయంలో చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం దక్కడం లేదు. జగిత్యాల జిల్లాలో గల్ఫ్కి వలసబాట పట్టినవారు లక్షకి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 30 వరకూ గల్ఫ్ ఏజెంట్ల సంస్థలు లైసెన్స్ కలిగి ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఇద్దరూ ముగ్గురు వరకూ.. గల్ఫ్ దందాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. తూతుమంత్రంగా గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు ఉండంతో నకీలీ పాస్పోర్ట్,నకీలీ వీసాలు దందా ఏళ్ళ తరబడిగా జరుగుతుంది.