TS: అప్పుడు TSPSC.. ఇప్పుడు SSC
తప్పుల నుంచి ప్రభుత్వం నేర్చుకునేదెప్పుడు?
విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం లైట్ తీసుకుందా?
పరీక్షల మీద అధికారులు కొంచెం కూడా దృష్టి సారించడం లేదా?
భదత్ర విషయంలో ప్రకటనలకే పరిమితమయ్యారా?
TSPSC పేపర్ లీక్ పై తెలంగాణ అగ్గిమీదగుగ్గిలమవుతూనే ఉంది.. కానీ ప్రభుత్వం ఈ తప్పు నుంచి ఏం నేర్చుకోలేదని క్లియర్ కట్ గా తెలుస్తోంది. లేదంటే పదో తరగతి పరీక్ష పేపర్లు సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొడుతాయి. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్న విషయాలను పక్కన పెడితే.. అసలు క్వశ్చన్ పేపర్.. అంత ఈజీగా బయటికి ఎలా వస్తుందనేది ఇప్పుడు ప్రభుత్వం తనకు తాను వేసుకోవాల్సిన క్వశ్చన్.
పేపర్ లీక్ కు అనుకూలంగా పరిస్థితులు ఉండటమే.. అసలు కారణమన్న వాదనలు విన్నాయి. ప్రభుత్వమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇది స్మార్ట్ యుగం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ గా మారిపోయింది. సమాచారం ఏదైనా.. సెకన్లలో లక్షలాది మందికి షేర్ చేసే యాప్స్ ఉన్నాయి ఇప్పుడు. అలాంటి స్మార్ట్ ఫోన్ ను పరీక్ష హాల్ లోకి ప్రభుత్వం ఎలా అనుమతించింది? అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
తాండూరులో తెలుగు పేపర్ లీక్ చేసిన బందెప్ప, సమ్మెప్పలు ఎగ్జామ్ హాల్ లో క్వశ్చన్ పేపర్లను ఫోటో తీసి.. బయటకి పంపారు. ఇది కచ్చితంగా ఇంటి దొంగల పనేనని ఇప్పటికే తేలిపోయింది. అయితే టీచర్లు ఎగ్జామ్ హాల్ లోకి స్మార్ట్ఫోన్లు ఎలా, ఎందుకు తీసుకొచ్చారు? ఇంత జరుగుతుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నారు? తెలుగు పేపర్ లీక్ అయ్యాక కానీ.. ఈ విషయం ప్రభుత్వానికి బోధపడలేదా? ప్రభుత్వం పరువు పోయాక కానీ.. సెక్యూరిటీని టైట్ చేయాలనిపించలేదా?
బందెప్ప అనే టీచర్ పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు తెలిసి కూడా ఆయన్ను ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తించడానికి అధికారులు ఎలా అనుమతించారు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అవసరమైన ఫ్లయింగ్ స్కాడ్లు, ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూరింటెండెంట్లను నియమిస్తారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడానికి ముందు.. ప్రతి జిల్లాలోని ఉన్నతాధికారులు ఇవే మాటలు చెప్పారు. కానీ ఆచరణలో అవేం అమల్లో లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే హిందీ పేపర్ లీక్ చేసిన విధానంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 144 సెక్షన్ అమల్లో ఉండగా.. ఓ బాలుడు ఎగ్జామ్ సెంటర్ కు అంత సమీపంలోకి ఎలా చేరుకున్నాడు? అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర, అధికారుల దగ్గర సమాధానం లేదు.
తప్పెవరిదైనా.. లీకేజీలకు బాధ్యులు ఎవరైనా.. బాధితులు మాత్రం విద్యార్థులే. ఇక ముందు నుంచైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వదిలి.. పకడ్బందీగా పరీకలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు.