Telangana Council : తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సిరికొండ మధుసూదనాచారిని కలిసి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తొలి తెలంగాణ స్పీకర్ గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి, ప్రస్తుతం మండలిలో ప్రతిపక్షనేతగా, బీఆర్ఎస్ పక్ష నేతగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనకి అప్పగించిన పనిని అంకితభావంతో నిర్వహిస్తానని మధుసూదనా చారి అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ ఐటీ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కేసీఆర్ తో ప్రత్యేక అనుబంధం…
తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుంచి నేటి వరకు మధుసూదనా చారి కేసీఆర్ వెన్నెంటే నడిచారు.గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి పనిచేశారు. నమ్మకంగా పనిచేస్తూ పార్టీకి విధేయుడిగా ఉన్న క్రమంలో ఆయనకు ప్రతిపక్ష నేతగా అవకాశం లభించింది.
ఎన్టీఆర్ పిలుపుతో…
మధుసూధనాచారి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ పిలుపుతో 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం టీడీపీలో చేరి 1994-99 మధ్య కాలంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా చట్టసభల్లోకి ప్రవేశించారు.
ఇక తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో 2001లో కేసీఆర్కు అత్యంత దగ్గరయ్యారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 8 నెలల ముందే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. సంస్థాగతంగా ఆ పార్టీని బలోపేతం చేయడంలోనూ చారి కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆయన కష్టాన్ని గుర్తించిన అప్పటి టీఆర్ఎస్, పోలిట్బ్యూరో సభ్యుడిగా అవకాశం కల్పించింది.
1994లో తొలిసారిగా గెలిచిన చారి, అప్పటి టీడీపీ సర్కారు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. చలించిపోయిన మధుసూధనాచారి పత్తి రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తీసుకురావడం గమనార్హం. రెండోసారి 1999 ఎన్నికల్లో పోటీ చేసిన చారి, ఓటమిపాలయ్యారు.
ముందస్తు ఎన్నికల్లో ఓటమి…
2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్గా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన చారి మరోసారి ఓటమి బాట పట్టారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ…
దీంతో అప్పటి సీఎం కేసీఆర్, ఆయన్ను 2021 నవంబరు 19న గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఈ మేరకు గవర్నరుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడంతో ఆయన నియామకానికి రాజ్ భవన్ కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 2021 డిసెంబరు 14న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ పక్షాన ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించనున్నారు.
Also Read : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ