Tatikonda Rajaiah news(Telangana politics): రెండుసార్లు అధికారంలోకి వచ్చి.. తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ కు.. మూడోసారి జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దెబ్బపడి పైకి లేచేలోపే మరో దెబ్బ పడుతోంది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. నిన్న మర్రి జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా వార్తలొచ్చాయి.
తాజాగా.. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాజయ్య ప్రకటనతో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్లైంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో తాటికొండ రాజయ్యకు స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచే ఆయన పార్టీ అధిష్టానంపై అసహనంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించగా అందుకు కూడా బీఆర్ఎస్ ఒప్పుకోలేదని సమాచారం.
తన అనుచరులతో లోతుగా చర్చించిన అనంతరం తాటికొండ రాజయ్య పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచార. రాజీనామా చేసి.. ఆ లెటర్ ను కేసీఆర్ కు పంపుతానని చెప్పారు. కాగా.. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో రాజయ్య టచ్ లో ఉన్నారు. ఆయనతో కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.
ఇటీవలే.. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను మరింత పెంచింది. సీఎంతో భేటీ అనంతరం ఆ ఐదుగురిపై బీఆర్ఎస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని, బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టించి ప్రొటోకాల్ ప్రకారం మాత్రమే సీఎంను కలిసినట్లు చెప్పించిందన్న వార్తలొచ్చాయి. నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించేందుకే సీఎంను కలిశామని ఎమ్మెల్యేలు చెప్పినా.. వారిపై బీఆర్ఎస్ కు ఇంకా అనుమానాలున్నాయి. లోక్ సభ ఎన్నికలు ముగిసేలోపు ఇంకెంతమంది బీఆర్ఎస్ నేతలు హస్తంగూటికి చేరుతారో చూడాలి.