Sabitha Indrareddy: తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు కూడా రచ్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనలకు దిగడం, నినాదాలు ఇచ్చారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం నేపథ్యంలో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఆందోళనబాట వీడలేదు. సీఎం చాంబర్ ముందు కూడా నిరసనకు దిగడంతో మార్షల్స్ రంగప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీలో 119 మంది చట్టసభ్యుల్లో 9 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని, అందులో అవమానానికి గురైన కారణంగా తాము నిలబడి ఉంటే కనీసం కూర్చోమని కూడా సూచించలేదని బాధపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు తమను కూర్చోమని సూచిస్తారేమో అని ఆశపడ్డామని, కానీ, వారు ఆ మాట అనలేదని చెప్పారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ఆగ్రహించారు. హైదరాబాద్ నగరంలో మహిళలకు భద్రత లేకుండా పోతున్నదని, చిన్న పిల్లలపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. మహిళలకు భద్రత లేదని, వీరి గురించే అసెంబ్లీలో మాట్లాడాలని తాము భావించామని చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆ అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు.
అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా ఒక వ్యక్తి పేరు తీసుకుని మాట్లాడినప్పుడు వారికి వివరణ ఇచ్చే అవకాశం ఇస్తారని, కానీ, తెలంగాణ అసెంబ్లీలో తమ పేర్లను ప్రస్తావించినా.. తమకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహించారు. తాము మోసం చేశామని సీఎం అన్నారని, అలాంటప్పుడు వివరణ ఇవ్వడానికి తమకు అవకాశం ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తమను అన్నారని, పార్టీ మారడమే పెద్ద తప్పు, మోసంగా వారు చిత్రిస్తున్నారని, మరి అలాంటప్పుడు కాంగ్రెస్లో ఉన్నది ఎవరు? అని ప్రశ్నించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారారు కదా? అని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క స్వయంగా సీఎం కావొచ్చు కదా.. కాంగ్రెస్ పెద్దల ముందు ఆ డిమాండ్ పెట్టి సీఎం పీఠం అధిరోహించవచ్చునని, అక్కడ పోరాడకుండా మహిళా ఎమ్మెల్యేలపైనా విరుచుకుపడటం బాధాకరమన్నారు.
సమాజంలో ఎక్కడ చూసినా మహిళలపై వివక్ష కనిపిస్తూనే ఉంటుందని, కానీ, చట్టసభల్లో కూడా ఈ వివక్షను తాము ప్రత్యక్షంగా ఎదుర్కొన్నామని, తాను, సునీతా ఇలాగే ఫీల్ అయ్యామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న.. కేటీఆర్కు సూచన చేస్తూ వెనుక ఉన్న అక్కలను నమ్ముకోవద్దని, వారు మిమ్మల్ని ముంచుతారని అన్నారని గుర్తు చశారు. ఈ రోజు అక్కలు దొర పన్నిన కుట్రలో చిక్కుకున్నారని, వారిని అక్కలు నమ్ముకోవద్దని అంటున్నారని తెలిపారు.
Also Read: కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చిస్తున్న అంశాలివే?
సభలో లేని కవిత గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఇది సంస్కారమా? అని సబితా ప్రశ్నించారు. మానవత్వం లేకుండా మాట్లాడినట్టుగానే అనిపించిందని, ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ జైలులో ఉంటే బాధాకరంగానే ఉంటుందని, సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. అకారణంగా కవిత గురించి మాట్లాడటం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడుతున్నారని, ద్వంద్వ నీతితో మాట్లాడుతున్నారని, సీఎం సీటులో కూర్చున్న రేవంత్ రెడ్డికి ఇది తగదన్నారు. సీఎం పదవి గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలని, కానీ, ట్విస్ట్ చేయొద్దని హితవు పలికారు.
అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని సీఎం అన్నారని, మరి సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నమ్ముతున్నారని, రాహుల్ గాంధీని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? అని సబితా ప్రశ్నించారు. ‘మమ్మల్ని అవమానించారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్ర సమాజం చూసింది’ అని వాపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడుల గురించి ఆలోచించాలని, వాటిని అడ్డుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రేపైనా ఈ విషయం మాట్లాడే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. తాము మొన్న ఈ విషయంపై మాట్లాడితే సమాధానం రాలేదని, ఏ ప్రభుత్వమైనా ప్రశ్నిస్తే సమాధానం ఇస్తుందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రశ్నలను గాలికి వదిలేస్తున్నదని మండిపడ్డారు.