Nalini
Nalini : తెలంగాణలో 2012లో ఉద్ధృతంగా ఉద్యమం జరుగుతున్న సమయంలో మారుమోగిన పేరు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే తన అన్నాచెల్లెళ్లపై లాఠీ చార్జ్ చేయలేనని ఆమె పైఅధికారులకు తేల్చి చెప్పి తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేశారు. అనంతరం ఆమె ఉద్యమంలో భాగమయ్యారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఇప్పుడు నళిని భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడైనా ఆమెకు సరైన గుర్తింపు దక్కాలని, నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డి కూడా నళిని గురించి ఆరా తీశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.