Professor Saibaba : దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం రాత్రి ప్రాణం విడిచారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో జీవితఖైదు విధించింది. సుమారు 9 సంవత్సరాలు ఆయన జైలులోనే మగ్గిపోయారు. ఈ కారణంగా ఆయన యూనివర్సిటీ నుంచి సైతం సస్పెండ్ అయ్యారు.
నిర్దోషిగా తీర్పిచ్చిన బాంబే హైకోర్టు…
మహారాష్ట్ర సెషన్స్ కోర్టు సాయిబాబాకు మరో ఐదుగురు మావోయిస్టులు మహేష్ తిర్కీ, పాండు నరోటే, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీతో సంబంధాలు ఉన్నాయని మార్చి 2017లో తేల్చింది. దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసే కార్యకలాపాలలో పాల్గొన్నారన్న అభియోగాలతో దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలోనే జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రాజీలేని పోరాటం…
మరోవైపు ప్రాఫెసర్ సాయిబాబా మరణం పట్ల సీపీఐ జాతీయ నేత డా.కె. నారాయణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నిజ జీవితంలో శారీరక వైకల్యం ఉన్నా, ప్రభుత్వ నిర్బంధాన్ని సైతం ఎదిరించిన ధీరుడని కీర్తించారు. ఆయన జీవితాంతం చేసిన రాజీలేని పొరాటంలో విజయం సాధించారన్నారు. పోరాటయోధులు సాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా పోరాట రీత్యా మనతోనే ఉన్నారన్నారు. వారి మరణం పట్ల వారి కుటుంబసభ్యులకు మరోసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
Also read : పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్